ఇందూరు, ఫిబ్రవరి 11: నైపుణ్యం ఉంటే ఉన్నత అవకాశాలు వాటంతట అవే వస్తాయని కేఎల్ డీమ్డ్ యూనివర్సిటీ డైరెక్టర్ ఆఫ్ అడ్మిషన్స్ డాక్టర్ జే శ్రీనివాసరావు పేర్కొన్నారు. ఇండస్ట్రీ-4 టెక్నాలజీతో ప్రపంచవ్యాప్తంగా ఉద్యోగ అవకాశాలు పొందేందుకు అవకాశం ఉన్నదని చెప్పారు. నిజామాబాద్లో ‘నమస్తే తెలంగాణ- కేఎల్ డీమ్డ్ యూనివర్సిటీ’ ఆధ్వర్యంలో ‘లక్ష్యం-2022’ పేరిట అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఇంటర్ తర్వాత తీసుకోవాల్సిన కోర్సులు, ఉద్యోగ అవకాశాలు, రుణ సదుపాయాలపై కాకతీయ కళాశాల విద్యార్థులకు సందేహాలు నివృత్తి చేశారు. ఈ సందర్భంగా శ్రీనివాసరావు మాట్లాడుతూ.. కేఎల్ యూనివర్సిటీలో అంతర్జాతీయ ప్రమాణాలు కలిగిన అధ్యాపకులు బోధిస్తారని తెలిపారు. ఇస్రో, డీఆర్డీవో, డీఎస్టీలకు చెందిన పరిశోధనా ప్రాజెక్టులతో నైపుణ్య శిక్షణ ఇస్తున్నామని చెప్పారు. మైక్రోసాఫ్ట్, ఐబీఎం, సిస్కో వంటి కంపెనీలకు చెందిన ఎక్సలెన్సీ కేంద్రాలను ఏర్పాటు చేసి విద్యార్థుల్లో సృజనాత్మకతను వెలికితీస్తున్నామని వివరించారు. యూనివర్సిటీ విద్యార్థులకు మెరిట్ టెస్ట్ నిర్వహించి ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు 10 నుంచి 100 శాతం వరకు ఫీజు రాయితీ ఇస్తున్నామని, 100 శాతం స్కాలర్షిప్ సౌకర్యం కల్పిస్తున్నామని తెలిపారు. కార్యక్రమంలో కేఎల్ యూనివర్సిటీ రీజినల్ మార్కెటింగ్ హెడ్ రాజేశ్, నమస్తే తెలంగాణ ఏజీఎం (మార్కెటింగ్) రాజిరెడ్డి, బ్రాంచి మేనేజర్ ధర్మరాజు, ఎడిషన్ ఇంచార్జి ప్రవీణ్కుమార్, బ్యూరో ఇంచార్జి రమేశ్, ఏడీవీటీ మేనేజర్ శ్రీకాంత్, ఏసీఎం నాగస్వామి పాల్గొన్నారు.