High Court | హైదరాబాద్, అక్టోబర్ 13 (నమస్తే తెలంగాణ): గ్రూప్-1 ప్రిలిమ్స్కు సంబంధించి దాఖలైన పలు కేసులపై హైకోర్టు తుది తీర్పును సోమవారం వెలువరించనున్నది. ఆయా కేసుల్లో ఇప్పటికే విచారణను పూర్తిచేసిన హైకోర్టు తీర్పును సోమవారానికి రిజర్వు చేసింది. ఈ తీర్పు ఎవరికి అనుకూలంగా వస్తుందోనన్న ఉత్కంఠ నెలకొన్నది. గ్రూప్-1 ప్రిలిమ్స్ ఫైనల్ ‘కీ’లో తప్పులున్నట్టు తాము ఆధారాలతో సహా కోర్టుకు సమర్పించామని, కాబట్టి తమకు అనుకూలంగా తీర్పు వస్తుందని అభ్యర్థులు భావిస్తున్నారు. తెలుగు అకాడమీ పుస్తకాలు ప్రామాణికం కాదని, వికీపీడియా, గూగుల్ ఆధారంగా ఫైనల్ ‘కీ’ని రూపొందించామని టీజీపీఎస్సీ హైకోర్టుకు తెలపడం వంటి అంశాలు తమకు అనుకూలంగా మారతాయని అభ్యర్థులు అంచనా వేస్తున్నారు.
గ్రూప్-1పై హైకోర్టులో 15కుపైగా కేసులు ఉన్నాయి. వీటిలో ఫైనల్ ‘కీ’పై వేసిన కేసు అత్యంత కీలకమైనది. వీటితోపాటు ఎస్టీ రిజర్వేషన్లకు సంబంధించి జీవో-33పై దాఖలైన కేసు, గతంలో దరఖాస్తు చేసుకున్న వారికి 503 పోస్టులు, కొత్త నోటిఫికేషన్లో అదనంగా చేర్చిన 60 పోస్టులకు కొత్తగా దరఖాస్తు చేసుకున్నవారికి అవకాశం ఇవ్వాలన్న అంశంపై వేసిన కేసు, హైకోర్టు మళ్లీ రీ ఎగ్జామ్ నిర్వహించాలని ఆదేశించిన నేపథ్యంలో, పాత నోటిఫికేషన్ను రద్దుచేసి కొత్త నోటిఫికేషన్ ఇవ్వడంపై వేసిన కేసులపై కూడా తీర్పు రానున్నది. ఈ నెల 16న రిజర్వేషన్లపై వేసిన మరో మూడు కేసులు సైతం హైకోర్టు ముందు విచారణకు రానున్నాయి.
ఈ నెల 21 నుంచి 27 వరకు గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలు జరగాల్సి ఉన్నది. అయితే, ఫైనల్ ‘కీ’తో పాటు మరికొన్ని కేసులు మెయిన్స్కు ఆటంకంగా నిలుస్తున్నాయి. గ్రూప్-1పై ఉన్న కేసులు తేలే దాకా పరీక్షలను నిర్వహించొద్దని అభ్యర్థులు కోరుతున్నారు. అంతవరకు ఈ నెల 21 నుంచి జరగాల్సిన పరీక్షలను వాయిదావేయాలని డిమాండ్ చేస్తున్నారు. కానీ టీజీపీఎస్సీ మాత్రం పరీక్షలకు ఏర్పాట్లు చేస్తున్నది. ఒకవేళ కోర్టు తీర్పు అభ్యర్థులకు అనుకూలంగా వస్తే మాత్రం, గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలను వాయిదా వేసే అవకాశం ఉంటుంది. కోర్టు తీర్పుకు అనుగుణంగా ఏర్పాట్లు చేయడానికి కమిషన్కు కొంత సమయం పడుతుంది.
గ్రూప్-1 మెయిన్స్ పరీక్షల హాల్టికెట్లను టీజీపీఎస్సీ సోమవారం విడుదల చేయనున్నది. అభ్యర్థులు సోమవారం నుంచే తమ హాల్టికెట్లను డౌన్లోడ్ చేసుకోవచ్చని, పరీక్షకు ఒకరోజు ముందు అంటే ఈ నెల 21 వరకు హాల్టికెట్లు అందుబాటులో ఉంటాయని తెలిపింది. ఈ నెల 21 నుంచి 27 వరకు మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పరీక్షలు నిర్వహిస్తారు. అభ్యర్థులను మధ్యాహ్నం 12:30 గంటల నుంచి పరీక్షాకేంద్రాల్లోకి అనుమతిస్తారు. ఈ పరీక్షలకు 31,382 మంది అభ్యర్థులు హాజరుకానున్నారు.