కొల్లాపూర్, అక్టోబర్ 9 : నాగర్కర్నూల్ జిల్లా కొల్లాపూర్ మండలంలో పాలమూరు – రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పనులకు వినియోగించిన ఓ ప్రముఖ కంపెనీకి చెందిన భారీ వాహనాలు ఆంధ్రా ప్రాంతానికి నెమ్మదిగా తరలిపోతున్నాయి. ఆంధ్ర ప్రదేశ్లోని కర్నూల్ జిల్లా నందికొట్కూర్ నియోజకవర్గంలోని కొత్తపల్లి మండలంలో ఏపీ సీఎం జగన్ సాగునీటి కోసం చేపట్టిన పోతిరెడ్డిపాడు ప్రాజెక్టు పనులకు ఈ వాహనాలను తరలిస్తున్నట్టు సమాచారం. కొల్లాపూర్ మండలం ఎల్లూరు శివారులోని రెగుమాన్గడ్డ ప్రాంతంలో నిలిచిన శ్రీశైలం బ్యాక్ వాటర్ వద్దకు అతి పెద్ద లాంచీని తీసుకొచ్చి దానిపై ఆయిల్ ట్యాంకర్, రోడ్డు రోలర్, టిప్పర్ను ఎక్కించి నదిని దాటించారు. కోతిగుండు, అమరగిరి, సోమశిల తీరం మీదుగా అవతలి వైపునకు వెళ్తున్న దృశ్యాలు ఆదివారం మధ్యాహ్నం సోమశిల వీఐపీ పుష్కరఘాట్ వద్ద ‘నమస్తే తెలంగాణ’ కెమెరాకు చిక్కాయి.