రాష్ట్రంలో శుక్రవారం విస్తారంగా వర్షాలు కురిశాయి. కామారెడ్డి జిల్లాలోని మద్నూ ర్ మండలం మెనూర్లో 13, మద్నూర్లో 12.03, సంగారెడ్డి జిల్లా నారాయణ ఖేడ్లో 11.20, మెదక్ జిల్లా నర్సాపూర్ మండలం చిప్పల్తుర్తిలో 11.03, సంగారెడ్డి జిల్లా కంగ్టిలో 10.40, పుల్కల్లో 10.33, మెదక్ జిల్లా అల్లాదుర్గంలో 10.03, సిద్దిపేట జిల్లా బెజ్జంకిలో 9.53, మానూర్లో 9.50, ఆదిలాబాద్ జిల్లా భోరజ్లో 9.35, మెదక్ జిల్లా నర్సాపూర్లో 9.33, సంగారెడ్డి జిల్లా కోహిర్లో 9.30, మెదక్ జిల్లా శంకరంపేట-ఏలో 9.25 సెంటీమీటర్ల వర్షం కురిసింది.
హైదరాబాద్/ హైదరాబాద్ సిటీబ్యూరో, జూన్ 11 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో వర్షాలు విస్తారంగా కురుస్తున్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో శని, ఆదివారాల్లో రాష్ట్రంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. అటు నైరుతి రుతుపవనాలు రాష్ట్రంలో చురుగ్గా కదులుతున్నాయి. ఉత్తర బంగాళాఖాతం పరిసర ప్రాంతాల్లో ట్రోపో ఆవరణం వరకు ఉన్న ఉపరితల ఆవర్తనం ప్రభావంతో వాయ వ్య బంగాళాఖాతం, ఒడిశా, పశ్చిమబెంగాల్ ప్రాంతంలో అల్పపీడనం ఏర్పడింది. దీనికి అనుబంధంగా మధ్య ట్రోపో ఆవరణం స్థాయి వరకు ఆవర్తనం వ్యాపించింది. రానున్న 24 గంటల్లో అల్పపీడనం మరింత బలపడి పశ్చిమ వాయవ్య దిశగా ప్రయాణించి ఒడిశా మీదుగా వెళ్లే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. శుక్రవారం అల్పపీడనప్రాంతం నుంచి ఒడిశా మీదుగా తెలంగాణ వరకు ద్రోణి ఏర్పడింది. దీని ప్రభావంతో శని, ఆదివారాల్లో ఉరుములు, మెరుపులు, గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తూ రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు తెలిపింది. ఈ నేపథ్యంలో రాష్ట్రప్రభుత్వం జీహెచ్ఎంసీ కమిషనర్ సహా జిల్లా కలెక్టర్లను అప్రమత్తం చేసింది. ప్రజలకు నష్టం జరుగకుండా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర విపత్తుల నిర్వహణశాఖ కమిషనర్ రాహుల్ బొజ్జా ఆదేశించారు. ముఖ్యంగా ఉమ్మడి అదిలాబాద్, కరీంనగర్, వరంగల్, నిజామాబాద్, ఖమ్మం, మెదక్ జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పారు. వరద ముంపు ఉండే లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తంగా ఉంచాలని సూచించారు. ఈదురు గాలులతో చెట్లు, విద్యుతు స్తంభాలు కూలిపోయే ప్రమాదం ఉందని, చెరువుల కట్టలు తెగిపోయే ప్రమాదం ఉందని ముందస్తు జాగ్రత్తలు చెప్పారు.