హైదరాబాద్, డిసెంబర్ 15 (నమస్తే తెలంగాణ): మార్ఫింగ్ ఫొటోలతో ప్రధాని, ముఖ్యమంత్రి, వివిధ రాజకీయ నాయకులు, మహిళలపై అసభ్యకరమైన వీడియోలు పోస్టు చేస్తున్నవారి మీద కేసులు నమోదు చేయడాన్ని సవాల్ చేస్తూ కాంగ్రెస్ దాఖలు చేసిన పిటిషన్పై హైకోర్టు గురువారం విచారణ జరిపింది. కౌంటర్ పిటిషన్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించిన న్యాయస్థానం.. విచారణను నాలుగు వారాలపాటు వాయిదా వేసింది.
పలు స్టేషన్లలో నమోదైన ఫిర్యాదుల మేరకు దర్యాప్తు జరిపిన పోలీసులు ఐపీ అడ్రస్ల ఆధారంగా మైండ్షేర్ యునైటెడ్ ఫౌండేషన్ ఉద్యోగులు ముగ్గురు సామాజిక మాధ్యమాల్లో మార్ఫింగ్ ఫొటోలతో అసభ్యకర పోస్టులు పెడుతున్నట్టు గుర్తించారు. వారినుంచి 10 ల్యాప్టాప్లను స్వాధీనం చేసుకున్నారు. అయితే వారు ముగ్గురు తమ పార్టీకి చెందిన ఎన్నికల వార్రూంలో పనిచేస్తున్న ఉద్యోగులని పేర్కొంటూ కాంగ్రెస్ నేత మల్లు రవి హైకోర్టును ఆశ్రయించారు. వారిని పోలీసులు అక్రమంగా అదుపులోకి తీసుకున్నారని ఆరోపిస్తూ గురువారం హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై న్యాయమూర్తులు జస్టిస్ ఏ అభిషేక్రెడ్డి, జస్టిస్ జువ్వాడి శ్రీదేవితో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. అయితే తామెవరినీ అక్రమంగా అదుపులోకి తీసుకోలేదని ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది సదాశివుని ముజీబ్కుమార్ కోర్టుకు తెలిపారు.
సిమ్లాకు చెందిన ఇషాన్ శర్మ, విశాఖ వాసి తాతినేని శశాంక్, విజయవాడకు చెందిన ఎం ప్రతాప్లను పోలీసులు అదుపులోకి తీసుకోలేదని, దర్యాప్తులో భాగంగా వారికి సీఆర్పీసీ సెక్షన్ 41(ఏ) కింద నోటీసులు మాత్రమే ఇచ్చారని చెప్పారు. మహిళల మనోభావాలు దెబ్బతీసేలా సోషల్మీడియాలో పోస్టులు పెట్టారంటూ వచ్చిన ఫిర్యాదులపై దర్యాప్తులో భాగంగా ఈ నోటీసులు ఇచ్చినట్టు తెలిపారు. కాగా, పిటిషనర్ తరఫు న్యాయవాది టీ రజనీకాంత్రెడ్డి వాదిస్తూ.. పోలీసులు ఆ ముగ్గురినీ అక్రమంగా 18 గంటలపాటు నిర్బంధంలో ఉంచారని ఆరోపించారు. బాధితులకు రూ.20 లక్షల చొప్పున పరిహారం ఇప్పించేలా ఉత్తర్వులు ఇవ్వాలని ధర్మాసనాన్ని కోరారు. అయితే వారెవరూ పోలీసుల అదుపులో లేరని ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది స్పష్టంచేశారు. ఈ వ్యాజ్యానికి సంబంధించి ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేసేందుకు నాలుగు వారాల గడువు ఇచ్చిన న్యాయస్థానం.. అంతవరకు విచారణను వాయిదా వేసింది.