HCCB | తెలంగాణ పారిశ్రామిక అభివృద్ధిలో పాలు పంచుకునేందుకు ప్రముఖ కూల్ డ్రింక్స్ తయారీ కంపెనీ హిందుస్థాన్ కోకా కోలా బెవెరేజెస్ (HCCB) ముందుకొచ్చింది. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డితో కంపెనీ ప్రతినిధుల బృందం సోమవారం భేటీ అయ్యింది. కోకా కోలా రాష్ట్రంలో ఇప్పటివరకు దాదాపు రూ.3వేలకోట్లకుపైగా పెట్టుబడులు పెట్టింది. సిద్దిపేట జిల్లా బండ తిమ్మాపూర్లో గ్రీన్ ఫీల్డ్ బాట్లింగ్ ప్లాంట్ నిర్మాణంలో ఉంది. రాష్ట్రంలో పెట్టుబడులతో పాటు సామాజిక అభివృద్ధిలో తమ కంపెనీ భాగస్వామ్యమవుతుందని, అందుకు తగిన విధంగా ప్రాజెక్టులను విస్తరిస్తామని ప్రతినిధులు పేర్కొన్నారు.
అయితే, పెట్టుబడులకు రక్షణ కల్పించడంతో పాటు పరిశ్రమల స్థాపనకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున తగినంత సహాయ సహకారాలు అందిస్తామని సీఎం కంపెనీ ప్రతినిధులకు భరోసా ఇచ్చారు. కంపెనీల ఏర్పాటుకు ముందుకు వచ్చే పారిశ్రామికవేత్తలు, పెట్టుబడిదారులకు రాష్ట్రంలో ఈజ్ ఆఫ్ డూయింగ్ విధానం అమల్లో ఉంటుందని చెప్పారు. హిందుస్థాన్ కోకా కోలా బెవెరేజెస్ (HCCB) పబ్లిక్ అఫైర్స్ చీఫ్ హిమాన్షు ప్రియదర్శనితో పాటు పలువురు కంపెనీ ప్రతినిధులు సీఎంను కలిసిన వారిలో ఉన్నారు.