హైదరాబాద్, ఏప్రిల్ 12 (నమస్తే తెలంగాణ): అధికారులపై నిరాధార ఆరోపణలు చేయడంతోపాటు వాస్తవాలను దాచిపెట్టి న్యాయస్థానాన్ని తప్పుదారి పట్టించేందుకు ప్రయత్నించారంటూ ఆదిబట్ల మాజీ చైర్పర్సన్ కే ఆర్తికపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. పనికిమాలిన పిటిషన్ వేసినందుకు బాధ్యత వహించాలంటూ ఆమెకు రూ.లక్ష జరిమానా విధించింది.
ఆ మొత్తాన్ని నాలుగు వారాల్లోగా లీగల్ సర్వీసెస్ అథారిటీకి జమ చేయాలని ఆదేశించింది. ఫిబ్రవరి 9న జరిగిన విశ్వాస పరీక్షలో ఆర్తిక ఓడిపోవడంతో కొత్త చైర్మన్, వైస్చైర్మన్ ఎన్నిక కోసం మార్చి 30న రంగారెడ్డి జిల్లా కలెక్టర్ నోటీసులు జారీ చేశారు. ఈ నోటీసులను సవాలు చేస్తూ ఆర్తిక హైకోర్టును ఆశ్రయించడంతో జస్టిస్ టీ వినోద్కుమార్ పై తీర్పు ఇచ్చారు.