కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఆరోగ్యశాఖ మంత్రి హరీష్ రావు మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రంలో ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. కరోనా నియంత్రణ చర్యలు, అరికట్టేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఆసుపత్రుల్లో ఉన్న సౌకర్యాలతో పాటు మరికొన్ని కీలక అంశాలపై హరీశ్ అధికారులతో చర్చించారు.
కరోనా వ్యాప్తిని అదుపుచేయడంతోపాటు ఆసుపత్రుల్లో సౌకర్యాల కల్పన, బస్తీ దవాఖానాల పెంపునకు ఇటీవల ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీచేసిన నేపథ్యంలో మంత్రి హరీష్ రావు నేడు అధికారులతో సమీక్ష నిర్వహించి, తాజా పరిస్థితిపై అధికారులతో చర్చించారు. వైద్యశాఖ కార్యదర్శి రిజ్వీ, ఆ శాఖ సంచాలకులు శ్రీనివాసరావు, డీఎంఈ రమేష్ రెడ్డి, టీఎస్ఎంఎస్ఐడీ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్, సీఎం ఓఎస్డీ గంగాధర్ తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.