Harish Rao | రేవంత్రెడ్డి సర్కారు రైతుల గుండెలపై తన్నిందని మాజీ మంత్రి, సిద్ధిపేట ఎమ్మెల్యే హరీశ్రావు విమర్శించారు. జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలం పూడూరులో వడ్ల కొనుగోలు కేంద్రాన్ని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా వడ్ల కొనుగోళ్లపై రైతులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. ప్రభుత్వం ధాన్యం సక్రమంగా కొనుగోలు చేయడం లేదని రైతులు హరీశ్రావుతో మొరపెట్టుకున్నారు. అనంతరం హరీశ్రావు మాట్లాడుతూ.. ‘రాష్ట్రవ్యాప్తంగా వడ్ల కొనుగోలు కేంద్రాల్లో రైతులు తీవ్రమైన ఇబ్బందులుపడుతున్నారు. ఓ వైపు రాష్ట్ర ప్రభుత్వం కేబినెట్ మీటింగ్ పెట్టి తడిసిన ధాన్యం కొనుగోలు చేస్తామని, రైతులకు ఇబ్బంది లేదని ప్రభుత్వం చెబుతున్నది. జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలం పూడూరు వడ్ల కొనుగోలు కేంద్రాన్ని ఆకస్మిక తనిఖీలో భాగంగా బీఆర్ఎస్ పార్టీ పక్షాన ఇక్కడికి రావడం జరిగింది’ అన్నారు.
‘ఇక్కడ రమేశ్, లక్ష్మారెడ్డి అనే రైతులున్నారు. వీరిద్దరు నెల రోజుల కిందట పూడూరు వడ్ల కొనుగోలు కేంద్రానికి ధాన్యం తెచ్చారు. రాత్రి వర్షంపడడంతో సంచులన్నీ తడిసిపోయాయి. చాలామంది రైతుల కుప్పలు తడిసి ధాన్యం మొలకలు వస్తున్నాయి. ధాన్యం కొనుగోలు చేయకపోవడంతో తీవ్రమైన నష్టం జరిగింది. ప్రభుత్వం మాటలు కోటలు దాటుతున్నయ్ తప్ప.. చేతలు గడపదాటడం లేదు. కొనుగోలు కేంద్రాల్లో ఓ రైతు 40 రోజులైందని.. మరో రైతు 30 రోజులైందని ప్రభుత్వం వడ్లు కొనడం లేదని చెబుతున్నారు. తడిసిన ధాన్యాన్ని తీసుకొని పరిస్థితి ఉంది. చాలామంది రైతులు ఇంత ఓపికలేక రూ.100-రూ.200 తక్కువ ధరకు మధ్య దళారులు, మిల్లర్లకు అమ్ముకునే పరిస్థితి ఏర్పడింది. ప్రభుత్వం ఎన్నికలకు ముందు రైతులకు ఆరు గ్యారెంటీల్లో భాగంగా బాండు పేపర్లపై రాసి ఇచ్చి.. రైతుల సెల్ఫోన్లకు మెస్సేజ్లు పంపి నమ్మకబలికి.. అధికారంలోకి వచ్చిన తర్వాత రైతుల గుండెలపై తన్నింది రేవంత్రెడ్డి ప్రభుత్వం’ అంటూ ధ్వజమెత్తారు.
‘అధికారంలోకి వస్తే వంద రోజుల్లో రైతుబంధును రూ.7500కు పెంచుతామని చెప్పి మోసం చేశారు. వంద రోజుల్లో వడ్లకు రూ.500 బోనస్ ఇస్తామని చెప్పి మోసం చేశారు. వంద రోజుల్లో రుణమాఫీ చేస్తామని మోసగించారు. వంద రోజుల్లో రూ.2లక్షల రుణమాఫీ, వ్యవసాయ కూలీలకు రూ.12వేలు, కౌలు రైతులకు రూ.15వేలు ఇస్తామని మోసగించారు. మీరు రైతులకు ఇచ్చిన హామీలను ఒక్కటీ నెరవేర్చలేదు. కనీసం రైతులు పండించిన వడ్లు కొనుగోలు చేస్తున్నరా? అంటే వడ్లు కొనడం చేతకావడం లేదు. గతంలో కేసీఆర్ ప్రభుత్వం యాసంగిలో 67లక్షల మెట్రిక్ టన్నులు కొనుగోలు చేస్తే.. కాంగ్రెస్ ప్రభుత్వం ఇవాళ్టికి 37లక్షలు కూడా దాటలేదు. రైతులకు ఓపికలేక, మీరు కొనుగోలు చేయక బయట అమ్ముకునే పరిస్థితి వచ్చింది. బాండ్ పేపర్పై రాసిచ్చి.. వడ్లకు బోనస్ ఇస్తామని ఇవాళ సన్నాలకు మాత్రమే ఇస్తామని ఇవాళ సన్నాయి నొక్కులు నొక్కుతున్నరు’ అంటూ విమర్శించారు.