BJP | హైదరాబాద్, ఏప్రిల్ 19 (నమస్తే తెలంగాణ): బీజేపీకి చేనేత కుటుంబాలు ఎందుకు ఓటెయ్యాలని అఖిల భారత పద్మశాలీ సంఘం చేనేత విభాగం ప్రశ్నించింది. ఈ మేరకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాకు చేనేత విభాగం జాతీయ అధ్యక్షుడు యరమాద వెంకన్న బుధవారం బహిరంగలేఖ రాశారు. కర్నాటకలో 40 లక్షల మందికి పైగా చేనేత కుటుంబాల వారున్నా నేడు జరగుతున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఆ వర్గానికి ఒక్క సీటు కూడా ఎందుకు కేటాయించలేదని నిలదీశారు. ఆ లేఖలో పలు ప్రశ్నలను ఆయన సంధించారు.
చేనేతపై జీఎస్టీ పన్ను వేసినందుకా?, జాతీయ అవార్డులు సాధించిన చేనేతలకు రాష్ట్రపతి, ప్రధానమంత్రితో సన్మానించే సంప్రదాయాన్ని తొలగించినందుకా? హ్యాండ్లూమ్, హ్యాండీక్రాఫ్ట్స్ బోర్డ్ రద్దు చేసినందుకా? నేషనల్ ఫ్లాగ్ కోడ్ను సవరించి ఖాదీ, చేనేత కళాకారుల పొట్ట కొట్టినందుకా?, చేనేత రంగానికి బడ్జెట్ కేటాయింపులు తగ్గించినందుకా? చేనేత కళాకారుల సంక్షేమ పథకాలను రద్దు చేసినందుకా? ఎందుకు బీజేపీకి ఓటెయ్యాలి.. అంటూ యరమాద వెంకన్న నిలదీశారు. ఆ ప్రశ్నలన్నింటికీ సమాధానం చెప్పి తీరాలని డిమాండ్ చేశారు.