హైదరాబాద్, అక్టోబర్ 11 (నమస్తే తెలంగాణ): తెలంగాణ అసోసియేషన్ ఆఫ్ యునైటెడ్ కింగ్డమ్ (టాక్) ఆధ్వర్యంలో లండన్లో సోమవారం చేనేత బతుకమ్మ-దసరా సంబురాలను ఘనంగా నిర్వహించారు. యూకే నలుమూలల నుంచి సుమారు 600లకుపైగా ప్రవాస కుటుంబాలు ఈ వేడుకలకు హాజరయ్యాయి. భారత సంతతికి చెందిన బ్రిటిష్ ఎంపీలు వీరేంద్రశర్మ, సిమా మల్హోత్రా, స్థానిక హాన్స్లో మేయర్ బిష్ణు గురుగ్ ముఖ్యఅతిథులుగా పాల్గొన్నారు. మంత్రి కేటీఆర్ స్ఫూర్తితో చేనేతకు చేయూతనిచ్చేందుకు ప్రతి ఏడాదిలాగే చేనేత దుస్తులు ధరించి బతుకమ్మ- దసరా వేడుకులు చేసుకున్నామని టాక్ వ్యవస్థాపకుడు అనిల్ కూర్మాచలం చెప్పారు. కొవిడ్ సమయంలో ప్రజల ప్రాణాలు రక్షించడానికి ఆరోగ్య సిబ్బంది చేసిన కృషిని గౌరవిస్తూ యూకేలోని నేషనల్ హెల్త్ సర్వీస్ (ఎస్హెచ్ఎస్), కొవిడ్ వారియర్స్కు కృతజ్ఞతలు తెలుపుతూ.. ఈ వేడుకలను అంకితమిస్తున్నట్టు తెలిపారు. కార్యక్రమంలో టాక్ ఉపాధ్యక్షులు సత్య చిలుముల, శుష్మణరెడ్డి, కమ్యూనిటీ అఫైర్స్ చైర్మన్ నవీన్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
తెలంగాణ ఎన్నారై ఫోరం ఆధ్వర్యంలో..
లండన్లో తెలంగాణ ఎన్నారై ఫోరం ఆధ్వర్యంలో సోమవారం బతుకమ్మ, దసరా సంబురాలను ఘనంగా నిర్వహించారు. లండన్ డిప్యూటీ మేయర్ రాజేశ్ అగర్వాల్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. లండన్లో బతుకమ్మ వేడుకల్లో పాల్గొన్నవారికి తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం అందజేశారు. భారత్ నుంచి తెచ్చిన జమ్మి చెట్టుకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో లండన్ ఎంపీలు వీరేంద్రశర్మ, సీమా మల్హోత్రా, స్థానిక మేయర్ బిష్ణు, ఫోరం అధ్యక్షుడు ప్రమోద్గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
జర్మనీలో బతుకమ్మ వేడుకలు
తెలంగాణ అసోసియేషన్ ఆఫ్ జర్మనీ (టీఏజే) బెర్లిన్లో ఆదివారం బతుకమ్మ వేడుకలను ఘనంగా నిర్వహించింది. స్థానిక గణేశ్ దేవాలయ సమీపంలో నిర్వహించిన వేడుకలకు సైన్స్ అండ్ టెక్నాలజీ కౌన్సిలర్, ఎంబసీ ఆఫ్ ఇండియా డాక్టర్ మధుసూదన్రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. కార్యక్రమంలో టీఏజే వ్యవస్థాపక అధ్యక్షుడు డాక్టర్ రఘు చాలిగంటి, ఉపాధ్యక్షుడు డాక్టర్ జీవన్రెడ్డి, టెంపుల్ అధ్యక్ష, ఉపాధ్యక్షులు జైరామ్ నాయుడు, కృష్ణమూర్తి తదితరులు పాల్గొన్నారు.
సింగరేణిభవన్లో వైభవంగా బతుకమ్మ..
రెడ్హిల్స్లోని సింగరేణిభవన్లో సోమవారం వైభవంగా బతుకమ్మ వేడుకలు నిర్వహించారు. సంస్థ సీఎండీ ఎన్ శ్రీధర్ ఆదేశాల మేరకు సింగరేణివ్యాప్తంగా అన్ని ఏరియాల్లో బతుకమ్మ వేడుకలను అధికారికంగా నిర్వహిస్తున్నట్టు సంస్థ జనరల్ మేనేజర్ (కో ఆర్డినేషన్) కే సూర్యనారాయణ తెలిపారు. వేడుకల్లో బొగ్గు గని అధికారుల సంఘం ప్రధాన కార్యదర్శి ఎన్వీ రాజశేఖర్రావు, ఈడీ (కోల్ మూమెంట్) అల్విన్, అడ్మినిస్ట్రేటివ్ మేనేజర్ ఎన్ భాస్కర్, లా మేనేజర్ శిరీషారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
నేడు రవీంద్రభారతిలో టీజీవోల బతుకమ్మ వేడుకలు
తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం (టీజీవో) ఆధ్వర్యంలో మంగళవారం రవీంద్రభారతిలో బతుకమ్మ వేడుకలు నిర్వహించనున్నట్టు ఆ సంఘం అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు వీ మమత, ఏ సత్యనారాయణ తెలిపారు. ఉత్సవాల వేదికను నాంపల్లిలోని టీజీవోభవన్ నుంచి రవీంద్రభారతికి మార్చినట్టు పేర్కొన్నారు. సాయంత్రం 4:30 గంటల నుంచి జరిగే వేడుకల్లో మంత్రి వీ శ్రీనివాస్గౌడ్ ముఖ్యఅతిథిగా పాల్గొంటారని వెల్లడించారు.