హైదరాబాద్, డిసెంబర్ 6(నమస్తే తెలంగాణ) : టీఎస్ఐఐసీ(TSIIC) చైర్మన్ గ్యాదరి బాలమల్లు(Gyadari Balamallu) బుధవారం తన పదవికి రాజీనామా(Resigned) చేశారు. తన రాజీనామా లేఖను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారికి పంపారు. తన పదవీకాలంలో సహకారం అందించిన అందరికీ కృతజ్ఞతలు తెలిపారు. టీఎస్ఐఐసీ ఇక ముందు కూడా మరింత అభివృద్ధి సాధించాలని ఆయన ఆకాంక్షించారు. కాగా, రాష్ట్రంలోని పలు కార్పొరేషన్ల చైర్మన్లు తమ పదవులకు ఇంతకుముందే రాజీనామా చేశారు. ఈ మేరకు రాజీనామా లేఖలను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారికి పంపారు. బీఆర్ఎస్ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదేశాలకు అనుగుణంగా రానున్న రోజుల్లో పనిచేస్తామని ప్రకటించారు.