హైదరాబాద్, మే 5 (నమస్తే తెలంగాణ): కాంగ్రెస్ నేత రాహుల్గాంధీ నేపాల్లోని నైట్క్లబ్లో చైనా రాయబారితో దేశ రహస్యాలు పంచుకున్నట్టు ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఆయనపై దేశద్రోహం కేసు నమోదు చేయాలని ప్రభుత్వ విప్ గువ్వల బాలరాజు డిమాండ్ చేశారు. తాను దేశద్రోహి అవునో కాదో రాహుల్గాంధీయే నిరూపించుకోవాలని సవాల్ చేశారు. ఈ వ్యవహారంపై రాహుల్గాంధీ వరంగల్ వేదికగా జవాబు చెప్పాలని కోరారు. టీఆర్ఎస్ఎల్పీ కార్యాలయంలో గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. దేశ ప్రతిష్ఠకు ముప్పు వాటిల్లేవిధంగా వ్యవహరిస్తున్నారంటూ వ్యక్తమవుతున్న అనుమానాలను నివృత్తి చేయాల్సిన బాధ్యత రాహుల్గాంధీపై ఉన్నదని పేర్కొన్నారు. పీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి వైట్చాలెంజ్కు కట్టుబడి రాహుల్గాంధీ వెంట్రుకలను పరీక్షల కోసం ఇప్పించాలని సవాల్ విసిరారు. రాహుల్ వైట్ చాలెంజ్కు సిద్ధమైతే మంత్రి కేటీఆర్ సిద్ధంగా ఉన్నారని చెప్పారు. తెలంగాణ ఉద్యమకారులపై తుపాకి ఎత్తిన రేవంత్రెడ్డిని రైఫిల్రెడ్డి అని పిలిచేవారని, ఇక వెంట్రుకరెడ్డి అనాలేమో అని ఎద్దేవా చేశారు. వాస్తవాలు తెలుసుకోకుండా మంత్రి కేటీఆర్పై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు రేవంత్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. చైనా రాయబారితో రాహుల్ ఉన్నది నిజమేనని చెప్తున్న రేవంత్ మాటలు అబద్ధమని తేలితే పీసీసీ పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.