నల్లగొండ : మాజీ ప్రధాని, దివంగత నేత పీవీ నరసింహా రావు( PV Narasimha Rao) తీసుకొచ్చిన సంస్కరణల ఫలితంగా దేశం అభివృద్ధి బాటలో పయనించిందని శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి(Gutta Sukhender Reddy) అన్నారు. పీవీ జయంతి సందర్భంగా బుధవారం నల్గొండ లోని క్యాంపు కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు .
ఈ సందర్భంగా గుత్తా సుఖేందర్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ ప్రాంతంలో జన్మించి భారతదేశానికి ప్రధానమంత్రి(Prime Minister)గా విశిష్ఠ సేవలందించారని కొనియాడారు. పీవీ బహుభాషా కోవిదుడని కొనియాడారు. అనర్గళంగా 17 భాషల్లో మాట్లాడి అందరిని ఆశ్చర్యానికి గురి చేసేవారన్నారు. కేవలం రాజకీయ నాయకుడు మాత్రమే కాకుండా రచయితగా గుర్తింపు పొందరన్నారు.
కవి సామ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ రచించిన ‘ వేయి పడగలు’ అనే రచనను సహస్రఫన్ అనే పేరుతో హిందీలోకి అనువాదం చేశారన్నారు. తెలంగాణ ప్రభుత్వం పీవీ శత జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించి, రాజధాని నగరం నడి బొడ్డున ఆయన విగ్రహాన్ని ఆవిష్కరించిదని గుర్తు చేశారు. నల్గొండ పట్టణంలో కూడా పీవీ విగ్రహాన్ని ఆవిష్కరిస్తామని వెల్లడించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రేగట్టే మల్లికార్జున్ రెడ్డి, కనగల్ జడ్పీటీసీ చిట్ల వెంకటేశం , వార్డు కౌన్సిలర్ యామ కవిత దయాకర్, బీఆర్ఎస్ నాయకులు యామ దయాకర్, ఐతగొని స్వామి గౌడ్, గోపాల్ రెడ్డి, వెంకటేశ్వర రావు ,యాదయ్య, హరికృష్ణ, మునాస వెంకన్న, తదితరులు పాల్గొన్నారు.