నల్లగొండ: సీఎం కేసీఆర్ (CM KCR) పాలనలో రాష్ట్రంలోని సబ్బండవర్గాలు, సకల జనులు సంతోషంగా ఉన్నారని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి (Gutha Sukender reddy) అన్నారు.
ప్రతి ఒక్కరికి ఎదో ఒక రూపంలో లబ్ధిజరిగిందన్నారు. తెలంగాణ (Telangana) ఏర్పడిన తొమ్మిదేండ్లలోనే వ్యవసాయ (Agriculture) ముఖచిత్రం మారిపోయిందని చెప్పారు. నల్లగొండలోని (Nalgonda) తన నివాసంలో ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో ఉద్యోగులు చాలా సంతోషంగా ఉన్నారని, దేశంలో అత్యధిక జీతాలు ఇస్తున్న ప్రభుత్వం తెలంగాణ అన్నారు. ఇప్పటికు 1.5 లక్షల ఉద్యోగాల భర్తీ పూర్తయిందని వెల్లడించారు. కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులర్ చేసిందని తెలిపారు.
అన్ని రంగాల్లో దేశానికి తెలంగాణ ఆదర్శంగా నిలిచిందని చెప్పారు. కానీ ప్రతిపక్షాలు అడ్డగోలుగా ఆరోపణలు చేస్తున్నాయని విమర్శించారు. తాము అధికారంలోకి వస్తామని కాంగ్రెస్, బీజేపీలు పగటి కలలు కంటున్నాయని ఎద్దేవాచేశారు. దేశ ప్రజలు కూడా కేసీఆర్ నాయకత్వం కావాలని కోరుకుంటున్నారని, కేసీఆర్ అంటేనే భరోసా అని ప్రజలు నమ్ముతున్నారని చెప్పారు. జూన్ 2 నుంచి 22 రోజుల పాటు నిర్వహించే రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలు విజయవంతం చేయాలని కోరారు.
ఉత్సవాల్లో ప్రతి ఒక్కరు పాల్గొనాలని, ఘనంగా జరుపుకోవాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ వాళ్లు అసూయతో రగిలిపోతున్నారని విమర్శించారు. అందుకే రాష్ట్ర అవతరణ ఉత్సవాలపై అవాకులు చవాకులు పేలుతున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. నల్లగొండ జిల్లాలో 12 మంది ఎమ్మెల్యే స్థానాలను బీఆర్ఎస్ మళ్లీ కైవసం చేసుకుంటుందని స్పష్టం చేశారు.