హైదరాబాద్, అక్టోబర్ 12 (నమస్తే తెలంగాణ): రాష్ట్రవ్యాప్తంగా పోడు భూములకు సంబంధించిన దరఖాస్తులను ఈ నెల మూడోవారం నుంచి స్వీకరించడానికి కావాల్సిన విధివిధానాలు రూపొందించాలని అధికారులను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్కుమార్ ఆదేశించారు. పోడు సమస్యను శాశ్వతంగా పరిషరించాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారని తెలిపారు. మంగళవారం ఉన్నతాధికారులతో సమావేశమైన ఆయన.. దరఖాస్తు ఎలా ఉండాలి? ఏ అంశాలు పొందుపరచాలి? అటవీ సరిహద్దుల అంశం, వివిధస్థాయిల్లో కమిటీల ఏర్పాటు, అటవీ పరిరక్షణకు పౌరుల భాగస్వామ్యం తదితర అంశాలపై చర్చించారు. జిల్లా కలెక్టర్లు, అటవీశాఖ కన్జర్వేటర్లు, డీఎఫ్వోలతో సమావేశం నిర్వహించాలని నిర్ణయించారు. సమావేశంలో అటవీశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, పీసీసీఎఫ్ శోభ, రిజిస్ట్రేషన్లు, స్టాంపులశాఖ కమిషనర్ శేషాద్రి, గిరిజన సంక్షేమశాఖ కార్యదర్శి క్రిష్టినాచోంగ్తు, టీఎస్టీఎస్ ఎండీ వెంకటేశ్వర్రావు తదితరులు పాల్గొన్నారు.