హైదరాబాద్ : తెలంగాణలోని కొవిడ్ మృతుల కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం ఊరట కలిగించే విషయాన్ని ప్రకటించింది. కొవిడ్తో మరణించిన వారి కుటుంబాలకు రూ. 50 వేలు ఎక్స్గ్రేషియా ఇవ్వనున్నట్లు వెల్లడించింది. రాష్ట్ర విపత్తుల నిర్వహణ నిధుల నుంచి ఈ పరిహారం అందజేయనున్నారు. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేసింది.
కొవిడ్ డెత్ సర్టిఫికెట్ ఇచ్చేందుకు అధికారులతో కమిటీ ఏర్పాటు చేయనున్నారు. మృతుల కుటుంబ సభ్యుల ఆన్లైన్లో దరఖాస్తులు చేసుకోవాలి. ఈ దరఖాస్తులను ఆయా జిల్లాల కలెక్టర్లు పరిశీలించి అర్హులైన వారికి పరిహారం అందజేయనున్నారు. దరఖాస్తు అందిన 30 రోజుల్లో అర్హులైన వారికి, ఆధార్తో లింకు ఉన్న బ్యాంకు ఖాతాల్లో డబ్బులు జమ చేయనున్నారు.