హైదరాబాద్ : ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ విధానంపై సాధారణ పరిపాలన శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. పోస్టుల వర్గీకరణ, పరీక్షా విధానంతో పాటు సిలబస్ను ప్రభుత్వం ప్రకటించింది. గ్రూప్-1లో 19 రకాల పోస్టులు, గ్రూప్-2లో 16 రకాల పోస్టులు కేటాయించినట్లు ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొన్నది. గ్రూప్-1 పోస్టులకు 900 మార్కులతో, గ్రూప్-2 పోస్టులకు 600 మార్కులకు రాత పరీక్ష నిర్వహించనున్నట్లు తెలిపింది. గ్రూప్-1, గ్రూప్-2 పోస్టుల భర్తీకి సంబంధించిన ఇంటర్వ్యూలను ప్రభుత్వం రద్దు చేసిన సంగతి తెలిసిందే.
గ్రూప్-3లో 8 రకాల పోస్టులు, 450 మార్కులతో రాత పరీక్ష నిర్వహించనున్నారు. గ్రూప్-4లో జూనియర్ అసిస్టెంట్, జూనియర్ అకౌంటెంట్ పోస్టులను భర్తీ చేయనున్నారు. గ్రూప్-4కు సంబంధించి 300 మార్కులకు రాతపరీక్ష నిర్వహించనున్నారు. ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్, జిల్లా సైనిక్ వెల్ఫేర్ ఆఫీసర్ ఉద్యోగాల భర్తీతో పాటు మరిన్ని పోస్టులకు సిలబస్, మార్కులను కూడా ప్రభుత్వం వెల్లడించింది.