హైదరాబాద్, సెప్టెంబర్ 14 (నమస్తే తెలంగాణ): పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి సంబంధించి పర్యావరణ అనుమతులను త్వరితగతిన మంజూరు చేయాలని కేంద్ర పర్యావరణ అటవీ శాఖ మంత్రిత్వశాఖ పరిధిలోని ఎక్స్పర్ట్ అప్రయిజల్ కమిటీ (ఈఏసీ)కి తెలంగాణ ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. ప్రాజెక్టు నిర్మాణ ఆవశ్యకతను కూలంకషంగా వివరించింది. ప్రాజెక్టుకు పర్యావరణ అనుమతులపై ఈఏసీ 34వ సమావేశంలో బుధవారం సుదీర్ఘమైన చర్చ కొనసాగింది. ఈఏసీ సభ్యులు లేవనెత్తిన అన్ని అంశాలపై సందేహాలను తెలంగాణ రాష్ట్ర సాగునీటి పారుదలశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్కుమార్ నివృత్తి చేశారు. ప్రాజెక్టు నిర్మాణ ఆవశ్యకతను బలంగా నొక్కి చెప్పారు.
రాష్ట్రంలోనే అత్యంత కరువు ప్రాంతాలైన మహబూబ్నగర్, నాగర్కర్నూల్, వనపర్తి, గద్వాల, రంగారెడ్డి తదితర జిల్లాల దాహార్తిని తీర్చడానికి, అక్కడి రైతాంగానికి సాగునీటిని అందించేందుకు తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్ఠాత్మకంగా పనులను చేపట్టిందని వెల్లడించారు. పర్యావరణ అనుమతులు లేకుండా ప్రాజెక్టు పనులు చేపట్టవద్దని ఎన్జీటీ ఆదేశాలు జారీ చేసిందని, దీంతో ప్రస్తుతం పనులు నిలిచిపోయాయని చెప్పారు. ఫలితంగా ఆయా కరువు ప్రాంతాలకు తీవ్ర నష్టం వాటిల్లుతున్నదని పేర్కొన్నారు. కరోనా పరిస్థితులు కుదుట పడిన నేపథ్యంలో ఇటీవలనే ప్రజాభిప్రాయ సేకరణ పూర్తి చేశామని స్పష్టం చేశారు. దీనిపై త్వరలోనే ఈఏసీ నిర్ణయం వెల్లడించే అవకాశముంది.
పోలవరం ముంపుపై అధ్యయన సమావేశం వాయిదా
సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు కేంద్ర జలవనరుల మంత్రిత్వశాఖ పోలవరం బ్యాక్వాటర్ ప్రభావంపై అధ్యయనం చేసేందుకు తెలంగా ణ, ఏపీ, ఒడిశా, ఛత్తీస్గఢ్ రాష్ర్టాలతో బుధవా రం జరపాల్సిన సమావేశం వాయిదా పడింది. ముంపుపై అధ్యయనానికి తమకు తగినంత సమయం ఇవ్వలేదని, హడావుడిగా సమావేశం ఏర్పాటు చేయడమేమిటని ఒడిశా అభ్యంతరం వ్యక్తం చేసింది. దీంతో కేంద్ర జలవనరుల శాఖ ఈ సమావేశాన్ని వాయిదా వేసింది. త్వరలోనే సమావేశ తేదీని ప్రకటిస్తామని వెల్లడించింది.
సీడబ్ల్యూసీకి పాలమూరు-రంగారెడ్డి డీపీఆర్
పాలమూరు-రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ సీమ్కు సంబంధించిన డీటైల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ (డీపీఆర్)ను రాష్ట్ర ప్రభుత్వం సీడబ్ల్యూసీకి సమర్పించింది. ఈ రిపోర్ట్ ప్రకారం.. శ్రీశైలం ఫోర్షోర్లోని ఎల్లూరు నుంచి రోజుకు 1.50 టీఎంసీల చొప్పున 60 రోజుల్లో 90 టీఎంసీలు ఎత్తిపోసి నాగర్కర్నూల్, మహబూబ్నగర్, వికారాబాద్, రంగారెడ్డి జిల్లాల్లోని 9 లక్షల ఎకరాలకు నీరు ఇవ్వనున్నారు. ఎల్లూరు, ఏదుల, కర్వెన, ఉద్దండాపూర్, కేపీ లక్ష్మీదేవిపల్లిలోని పంపుహౌస్ల ద్వారా నీటిని ఎత్తిపోస్తారు.
నార్లాపూర్, ఏదుల, వట్టెం, కర్వెన, ఉద్దండాపూర్, కేపీ లక్ష్మీదేవిపల్లి రిజర్వాయర్లలో మొత్తం 67.97 టీఎంసీల నీరు నిల్వ చేస్తారు. నాగర్కర్నూల్ సీఈ హమీద్ ఖాన్ సమర్పించిన ఈ డీపీఆర్.. సీడబ్ల్యూసీలోని కాస్ట్ అప్రైజల్, హైడ్రాలజీ, ఇంటర్స్టేట్, ఇరిగేషన్ ప్లానింగ్ డైరెక్టరేట్ల పరిశీలనలో ఉన్నది. దీనిపై పొరుగు రాష్ట్రాల అభిప్రాయాలు, ఇతర అంశాలను పరిశీలించాక సీడబ్ల్యూసీ అనుమతులు ఇచ్చే అవకాశం ఉన్నది. 2015-16లో ప్రభుత్వం రూ.35,200 కోట్లతో పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టును చేపట్టింది. ఈ ప్రాజెక్టుకు అవసరమైన 27,019 ఎకరాల భూమిలో ఇప్పటికే 25,768 ఎకరాలను సేకరించడంతో మొదటి దశ పర్యావరణ అనుమతులు వచ్చాయి.