Bahadurguda | రంగారెడ్డి, జూలై 19 (నమస్తేతెలంగాణ): రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలంలోని బహదూర్గూడ గ్రామంలో శనివారం జరిగిన ఘటనలో మహిళా రైతులపై పోలీసులు నాన్బెయిలబుల్ కేసులు నమోదు చేశారు. ఈ ఘటనపై రెండు కేసులు నమోదు చేయగా, బీఆర్ఎస్ నేతలతో పాటు 50 మంది ప్రమేయం ఉన్నట్టు ఎఫ్ఐఆర్లో పేర్కొన్నారు. వివరాల్లోకి వెళ్తే బహదూర్గూడ గ్రామంలోని సర్వే నంబర్ 28, 62లో ఉన్న 650 ఎకరాల భూమిలో కొంతకాలంగా తాము వ్యవసాయం చేసుకుంటున్నట్టుగా రైతులు చెప్తున్నారు. కాగా, ఇది ప్రభుత్వ భూమిగా పేర్కొంటూ బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్ట్ కోసం రాష్ట్ర సర్కార్ కేటాయించింది. దీనిని ఆయా గ్రామాల ప్రజలు వ్యతిరేకిస్తున్నారు.
బాధిత రైతులు కొంతకాలంగా ఆ ప్రదేశంలో దీక్షకు దిగారు. శనివారం తెల్లవారుజామున ఈ దీక్షా శిబిరాన్ని ఎత్తివేసేందుకు పోలీసులు యత్నించగా, రైతులు అడ్డుకున్నారు. దీంతో రైతులు ఎదురుతిరుగగా, పోలీసులు అరెస్ట్ చేసి వివిధ పోలీస్ స్టేషన్లకు తరలించారు. కాగా, బహదూర్గూడ, లక్ష్మీతండాకు చెందిన జటావత్ రవీందర్, జటావత్ కమ్లీ, జటావత్ మణి, గాయత్రి, మెగావత్ నీలమ్మ, ఎలుకని జ్యోతి, దేవెందర్తో పాటు మరికొంతమందిపై సెక్షన్ 133, 308-2, 121-1, బీఎన్ఎస్ యాక్ట్ కింద కేసు నమోదు చేశారు. క్రైం నంబర్ 401లో భాగంగా కేసులు నమోదు చేశారు. కార్తీక్రెడ్డితో పాటు మరో 35మందిపై కేసు నమోదు చేశారు.
మరో ఘటనలో క్రైం నంబర్ 400లో భాగంగా బీఆర్ఎస్ నాయకులు కార్తీక్రెడ్డితో పాటు డీసీఎంఎస్ మాజీ చైర్మన్ ఎల్లయ్య, ఆ పార్టీ నాయకులు చిలుకమర్రి నర్సింహ, పంతంగి భూపాల్గౌడ్, మహేందర్, కొలను ప్రదీప్రెడ్డి, యాదగిరి, రాహుల్, మహేందర్యాదవ్, పరమేశ్వరి, వేణుగౌడ్, హరిప్రసాద్, జనార్దన్యాదవ్, భిక్షపతియాదవ్, యాదయ్య, శంకరమ్మ, పార్వతమ్మ, సుధా, మీనా, సరస్వతి, సుమలత, భాగ్య, యాదమ్మ, చంద్రయ్య, మహేశ్వర్రెడ్డి, కొర్ర దినేశ్, నర్సింగ్రాజు, క్యామ శ్రీకాంత్, వట్టపల్లి శ్రీనివాస్నాయక్, విజయ్కుమార్, ఏర్పుల ప్రభాకర్, వెంకటేశ్గౌడ్, శ్రీకాంత్, సురేందర్, మహేందర్పై సెక్షన్ 170తో బీఎన్ఎస్ఎస్ సెక్షన్ కింద కేసులు నమోదు చేశారు. దీంతోపాటు మరికొంతమందిపై కూడా అనుమానితులుగా కేసులు నమోదు చేశారు.
తమ విధులకు ఆటంకం కలిగించడమే కాకుండా తమ కండ్లల్లో కారం చల్లి, కుర్చీలు, రాళ్లు, రాడ్లతో దాడి చేశారని శంషాబాద్ ఎస్సై వనజ ఫిర్యాదు చేశారు. మరో కేసును విజయ్ అనే పోలీసు ఫిర్యాదు మేరకు నమోదు చేశారు. తమ భూముల్లో శాంతియుతంగా ఆందోళన చేస్తున్న వారిని రెచ్చగొట్టి తమపైనే కేసులు నమోదు చేయడంపై రైతులు మండిపడుతున్నారు.