Governor Tamilisai | హైదరాబాద్ : తెలంగాణలోని ఆర్టీసీ కార్మికులను రాష్ట్ర ప్రభుత్వంలో విలీనం చేస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన ఇటీవల జరిగిన కేబినెట్ సమావేశంలో నిర్ణయించిన సంగతి తెలిసిందే. దీంతో కేబినెట్ నిర్ణయానికి అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం ఆర్టీసీ బిల్లు రూపొందించింది. ప్రస్తుతం కొనసాగుతున్న అసెంబ్లీ సమావేశాల్లో ఆర్టీసీ విలీనం బిల్లు పాస్ చేయాలనే సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం ఉంది. కానీ ఆర్టీసీ విలీనం బిల్లుకు రాజ్భవన్ మోకాలడ్డుతోంది.
ఈ బిల్లుపై గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ తన అభిప్రాయాన్ని చెప్పలేదు. రెండు రోజుల నుంచి ఆమె నుంచి ఎలాంటి స్పందన లేదు. సాంకేతికంగా మనీ బిల్లు కావడంతో గవర్నర్ కాన్సెంట్ కోసం రాష్ట్ర సర్కార్ పంపింది. అసెంబ్లీ సెషన్ ముగిసేలోగా గవర్నర్ కాన్సెంట్ చెప్పాలి. కానీ.. రెండు రోజులుగా గవర్నర్ స్పందించడం లేదు. గవర్నర్ తీరుపై ఆర్టీసీ కార్మికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర సర్కారుపై వ్యతిరేక వైఖరితోనే ఆర్టీసీ బిల్లును గవర్నర్ ఆపుతున్నారని కార్మికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆర్టీసీ కార్మికుల్లో అధిక శాతం బడుగు, బలహీన వర్గాలు, పేదలే ఉన్నారు. అలాంటి వారిని ఇబ్బంది పెట్టేలా గవర్నర్ వ్యవస్థ వ్యవహరించడంపై రాష్ట్ర వ్యాప్తంగా చర్చ కొనసాగుతోంది.