హైదరాబాద్: ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం (RTC govt merger Bill) చేస్తూ రూపొందించిన బిల్లులో అభ్యంతరాలు ఉన్నాయంటూ గవర్నర్ తమిళిసై (Governor Tamilisai) బిల్లును అడ్డుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో గవర్నర్ లేవనెత్తిన అభ్యంతరాలపై ప్రభుత్వం వివరణ ఇచ్చింది. ఈమేరకు కాపీని రాజ్భవన్కు (Rajbhavan) పంపించింది. ఆర్టీసీ కార్మికులకు కార్పొరేషన్ కంటే మెరుగైన జీతాలు ఉంటాయని ప్రభుత్వం అందులో పేర్కొన్నది. విలీనమైన తర్వాత రూపొందించే గైడ్లైన్స్లో అన్ని అంశాలు ఉంటాయని తెలిపింది. కేంద్ర ప్రభుత్వ వాటా, 9వ షెడ్యూల్ సమస్యలను ఆంధ్రప్రదేశ్ తీరుగానే పరిష్కరిస్తామని వెల్లడించింది.
తెలంగాణలోని ఆర్టీసీ కార్మికులను రాష్ట్ర ప్రభుత్వంలో విలీనం చేస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన ఇటీవల జరిగిన కేబినెట్ సమావేశంలో నిర్ణయించిన సంగతి తెలిసిందే. దీంతో కేబినెట్ నిర్ణయానికి అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం ఆర్టీసీ బిల్లు రూపొందించింది. ప్రస్తుతం కొనసాగుతున్న అసెంబ్లీ సమావేశాల్లో ఆర్టీసీ విలీనం బిల్లు పాస్ చేయాలనే సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం ఉన్నది. కానీ ఆర్టీసీ విలీనం బిల్లుకు రాజ్భవన్ మోకాలడ్డుతోంది. సాంకేతికంగా మనీ బిల్లు కావడంతో గవర్నర్ కాన్సెంట్ కోసం రాష్ట్ర సర్కార్ పంపింది. అయితే బిల్లుపై గవర్నర్ పలు అభ్యంతరాలను వెలిబుచ్చారు. బిల్లు ఆమోదానికి తనకు కొంత సమయం కావాలని చెప్పారు. దీంతో సభలో ఆర్టీసీ బిల్లును ప్రవేశపెట్టడానికి అడ్డంకిగామారింది.
ఈ నేపథ్యంలో గవర్నర్ వ్యవహారశైలికి నిరసనగా ఆర్టీసీ కార్మికులు జంగ్సైరన్ పూరించారు. శనివారం ఉదయం 2 గంటలపాటు బస్సులను నిలిపివేశారు. డిపోల ముందు ధర్నా నిర్వహించారు. గవర్నర్ బంగ్లాను ముట్టడించిన ఆర్టీసీ కార్మికులు, సిబ్బంది.. రాజ్భవన్ ముందు బైఠాయించారు. దీంతో రాజ్భవన్ వద్ద ఉద్రిక్త పరిస్థితి నెలకొన్నది. ఈ నేపథ్యంలో గవర్నర్ లేవనెత్తిన అభ్యంతరలకు ప్రభుత్వం వివరణ ఇచ్చింది.