హైదరాబాద్, మార్చి 14 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో ఎకో టూరిజం ప్రాజెక్టుల గుర్తింపు, నిర్వహణ, ఉపాధి కల్పన అంశాలపై అధ్యయనం కోసం ప్రభుత్వం కమిటీని ఏర్పాటు చేసింది. ఏకో టూరిజం ప్రాజెక్టుల కోసం అనువైన ప్రాంతాలు, మౌలిక వసతుల వంటి అంశాలపై అధ్యయనం చేసి నివేదిక అందించాలని కమిటీకి సూచించింది. ఈ మేరకు అటవీ, పర్యావరణం, శాస్త్ర సాంకేతికశాఖ ముఖ్యకార్యదర్శి ఏ వాణీప్రసాద్ గురువారం ఉత్తర్వులు జారీచేశారు.
ఈ కమిటీకి రాష్ట్ర అటవీ, పర్యావరణశాఖ మంత్రి చైర్మన్గా, ఆర్థికశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, అటవీశాఖ ముఖ్యకార్యదర్శి, అటవీశాఖ ప్రధాన పీసీసీఎఫ్, వైల్డ్లైఫ్ పీసీసీఎఫ్, నీటిపారుదలశాఖ సెక్రటరీ, టీఎఫ్డీ కార్పొరేషన్ ఎండీ, టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ ఎండీ, గిరిజన సంక్షేమశాఖ కమిషనర్, దేవాదాయశాఖ కమిషనర్, తెలంగాణ కాన్ఫడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ ప్రతినిధి, జూపా ర్క్ డైరెక్టర్, ఎకో టూరిజం ఈడీ, వరల్డ్ వైల్డ్లైఫ్ ఫెడరేషన్ ప్రతినిధి, జూలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ప్రతినిధి, నలుగురు స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు సభ్యులుగా ఉంటారు.
సూపరింటెండెంట్స్కు గెజిటెడ్ హోదా
అటవీశాఖలో పనిచేస్తున్న సూపరింటెండెంట్స్కు అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్స్గా రాష్ట్ర ప్రభుత్వం గెజిటెడ్ హోదాను కల్పిస్తూ గురువారం ఉత్తర్వులు జారీచేసింది. టీఎన్జీవోల ఫారెస్ట్ ఫోరమ్ స్టేట్ యూనియన్ సచివాలయంలో మంత్రి కొండా సురేఖను కలిసి కృతజ్ఞతలు తెలిపారు.