హైదరాబాద్, జూలై 16 (నమస్తే తెలంగాణ): భారీ వానలకు ఉగ్రరూపం దాల్చిన గోదావరి నది శాంతించింది. వరద తగ్గుముఖం పట్టింది. దీంతో భద్రాచలం వద్ద వరద ఉద్ధృతి తగ్గిపోయింది. శుక్రవారం అర్ధరాతి వరకు 71.9 అడుగుల మేర ప్రవహించి క్రమంగా తగ్గిముఖం పట్టింది. ప్రస్తుతం 69 అడుగులకు చేరుకొన్నది.
ఎగువన ఎస్సారెస్పీకి 26 వేల క్యూసెక్కుల వరద వస్తుండగా, ఎల్లంపల్లి, పార్వతి, సరస్వతి బరాజ్ల వద్దకు 1.20 లక్షల క్యూసెక్కుల వరద వచ్చి చేరుతున్నది. భద్రాచలం వద్ద 20 లక్షల క్యూసెక్కుల వరద ఇప్పటికీ కొనసాగుతున్నది. అటు.. కృష్ణా, తుంగభద్ర నదులకు వరద పోటెత్తుతున్నది. శ్రీశైలం ప్రాజెక్టుకు వరద క్రమంగా పెరుగుతున్నది. ప్రస్తుతం 2.60 లక్షల క్యూసెక్కుల వరద వస్తున్నది.