హైదరాబాద్, సెప్టెంబర్ 13 (నమస్తే తెలంగాణ): నీటిపారుదల శాఖలో అసిస్టెంట్ ఇంజినీర్లుగా (ఏఈ) 11 ఏండ్ల సర్వీస్ పూర్తిచేసిన వారికి డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లుగా (డీఈఈ) పదోన్నతి కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవో 112 చట్టబద్ధమైనదేనని హైకోర్టు స్పష్టం చేసింది. సమాన అవకాశాల కల్పన కోసం ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవడాన్ని ఆమోదించింది. ఈ మేరకు 2018లో జారీ అయిన జీవో 32ను సవరించడం సమర్థనీయమేమని, సర్వీస్ నిబంధనలను సవరించే అధికారం ప్రభుత్వానికి ఉన్నదని జస్టిస్ పీ మాధవీదేవి తీర్పు చెప్పారు. డీఈఈ పదోన్నతుల్లో ఏఈఈ, ఏఈలకు 3:1 నిష్పతిలో అవకాశం ఉంటుంది కాబట్టి ఎవరికీ అన్యాయం జరగదని పేర్కొన్నారు. ఏఈలకు డీఈఈలుగా పదోన్నతి కల్పించేందుకు నిబంధనలను మినహాయించడం చెల్లదంటూ ఇంజినీర్-ఇన్-చీఫ్ నివేదించడం కేవలం సిఫారసు మాత్రమేనని, దాన్ని అమలు చేయాల్సిన ప్రభుత్వంపై లేదని తెలిపారు. పిటిషనర్ ఆరోపిస్తున్నట్టుగా ఈ వ్యవహారంలో ప్రభుత్వానికి ఎలాంటి దురుద్దేశాలు లేవని, ప్రభుత్వ నిర్ణయంలో ప్రజాహితమే కనిపిస్తున్నదని స్పష్టం చేశారు.