హైదరాబాద్, డిసెంబర్ 23 (నమస్తేతెలంగాణ): ప్రపంచంలోనే అతిపెద్ద చేపగా గుర్తింపుపొందిన ‘వేల్షార్క్’ విశాఖ తీరానికి వచ్చింది. తంతడి బీచ్లో స్థానిక మత్స్యకారుల వలకు చిక్కింది. 50 అడుగుల పొడవు, 2 టన్నుల బరువు ఉండే ఈ చేప ఒడ్డుకు రావడాన్ని గమనించిన వైల్డ్లైఫ్ ఫొటోగ్రాఫర్ శ్రీకాంత్ మన్నెపూరి వెంటనే అటవీశాఖ అధికారులకు తెలియజేశారు. విశాఖ డీఎఫ్వో అనంత్శంకర్ ఆదేశాల మేరకు సిబ్బంది వెంటనే తంతడి బీచ్కు చేరుకొని అంతరించిపోతున్న షార్క్ల జాతిలో ఒకటైన వేల్షార్క్గా నిర్ధారించారు. షార్క్ను సురక్షితంగా సముంద్రంలోకి పంపించే ఏర్పాట్లు చేయాలని డీఎఫ్వో అనంత్శంకర్ ఆదేశించడంతో అటవీశాఖ సిబ్బంది, మత్స్యకారులు, వన్యప్రాణుల సంరక్షకులు షార్క్కు ఫిల్టర్ ఫీడింగ్ ఇచ్చారు. అనంతరం సురక్షితంగా సముద్రంలోకి పంపించారు. సముద్రంలో చేపల వేటకు వెళ్లినప్పుడు మత్స్యకారులకు ఇలాంటి అరుదైన చేపలు చిక్కినప్పుడు, వాటికి ఎలాంటి హాని తలపెట్టకుండాతమకు సమాచారం అందించాలని అటవీశాఖ అధికారులు సూచించారు. వాటిని పట్టుకున్నప్పుడు మత్స్యకారులకు ఎలాంటి నష్టం జరిగినా ప్రభుత్వం సహాయం అందిస్తుందని తెలిపారు.