హైదరాబాద్, మే 17 (నమస్తే తెలంగాణ) : బొగ్గు, విద్యుత్తు ఉత్పత్తి, సంక్షేమ కార్యక్రమాల్లో దేశంలోనే అగ్రగామిగా నిలుస్తున్న సింగరేణికి జాతీయ, అంతర్జాతీయ పురస్కారాలు వరించాయి. రెండు రోజుల పాటు భువనేశ్వర్లో 22వ జియోమైన్ టెక్ అంతర్జాతీయ సదస్సు నిర్వహించారు. ఈ సదస్సులో మానవ వనరుల అభివృద్ధి, కార్మిక సంక్షేమం, కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ, యంత్రాల సమర్థ వినియోగం, పర్యావరణహిత చర్యలు, ఉత్పత్తిలో వృద్ధి, రక్షణ, కరోనా కట్టడి చర్యలకుగానూ సింగరేణికి విబ్జియార్ అవార్డును అందజేశారు. సింగరేణి సీనియర్ డైరెక్టర్ (ఆపరేషన్స్) చంద్రశేఖర్కు ఇన్నోవేటివ్ లీడర్షిప్ అవార్డు దక్కింది. సుమారుగా 13 వేల మొక్కలు నాటి, పర్యవేక్షిస్తున్న మరో డైరెక్టర్ బలరామ్కు ఎన్విరాన్మెంట్ ఎక్స్లెన్స్ అవార్డును ప్రదానం చేశారు. “ఆధునిక యంత్రాలు- నిర్వహణ- రక్షణ” అనే అంశంపై మైనింగ్ రంగ నిపుణులు తమ పత్రాలను సమర్పించారు. జియోమైన్ టెక్ కాన్ఫరెన్స్ సెక్రటరీ జయకుమార్ హోటా, సిమ్ ఫర్ మాజీ డైరెక్టర్, ధన్బాద్ ఐఐటీ చైర్మన్ బీడీ మిశ్రాతోపాటు పలువురు ప్రముఖులు అవార్డులు అందజేశారు. సదస్సులో జాతీయ, అంతర్జాతీయ సంస్థలైన నాల్కో, కోలిండియా, ఓఎన్జీసీ, వేదాంత, ఆర్సిలర్ మిట్టల్ తదితర 50కిపైగా కంపెనీల ప్రతినిధులు పాల్గొన్నారు.