హైదరాబాద్, ఫిబ్రవరి 6 (నమస్తే తెలంగాణ) : గ్రాడ్యుయేట్ ఆప్టిట్యూట్ టెస్ట్(గేట్) పరీక్షలు శనివారం నుంచి ప్రారంభంకానున్నాయి. శని, ఆదివారాల్లో పరీక్షలు జరుగనుండగా, 14,15 తేదీల్లోనూ కొన్ని పేపర్లకు పరీక్షలు నిర్వహిస్తారు. ఆన్లైన్లో నిర్వహించే ఈ పరీక్షకు గంటన్నరముందు నుంచే అభ్యర్థులను అనుమతిస్తారు. ఈ ఏడాది రికార్డుస్థాయిలో అభ్యర్థులు గేట్ పరీక్షకు దరఖాస్తు చేశారు. ఈ సంవత్సరం దరఖాస్తుల సంఖ్య 10 లక్షలు దాటింది. 2025లో 9.36లక్షల మంది దరఖాస్తు చేశారు. కంప్యూటర్ సైన్స్ పేపర్కు రికార్డుస్థాయిలో రెండు లక్షలకుపైగా అభ్యర్థులు దరఖాస్తులు సమర్పించారు. క్యాంపస్ ప్లేస్మెంట్స్ లేకపోవడం, రిక్రూట్మెంట్స్ మందగించడంతో గేట్కు అభ్యర్థులు పోటీపడుతున్నారు.
పాలిటెక్నిక్లో 18వేల సీట్లు
హైదరాబాద్, ఫిబ్రవరి 6 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలో పాలిటెక్నిక్ కోర్సుల్లో సీట్లు పెరుగనున్నాయి. ఈ విద్యాసంవత్సరం వరకు పాలిటెక్నిక్ కోర్సుల్లో 13,050 సీట్లు ఉన్నాయి. కొత్త విద్యాసంవత్సరంలో 18,330 సీట్లకు చేరనున్నాయి. అంటే 5,280 సీట్లు పెరుగబోతున్నాయి. కొత్త కోర్సులను ప్రవేశపెట్టనుండటంతో ఈ సీట్లు పెరుగనున్నాయి.