గజ్వేల్, జూన్13: రాష్ట్ర అభివృద్ధికి గజ్వేల్ పట్టణం రోల్మోడల్గా మారిందని ఆర్థికశాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు పేర్కొన్నారు. ఆదివారం గజ్వేల్ పట్టణంలో మున్సిపల్ కార్యాలయంతోపాటు రూ.28.87 కోట్లతో చేపట్టిన పలు అభివృద్ధి పనుల ప్రారంభోత్సవాలు, కొడకండ్లలో డబుల్ బెడ్రూం ఇండ్లను ఎక్సైజ్శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా హరీశ్రావు మాట్లాడుతూ.. గజ్వేల్ ఎమ్మెల్యేగా గెలిచిన ఏడాదికే సీఎం కేసీఆర్ మిషన్ భగీరథతో గోదావరి శుద్ధ జలాలను అందించారని చెప్పారు. గజ్వేల్, సిరిసిల్లలో నిర్మించిన విధంగా రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీల్లో సమీకృత మార్కెట్ల నిర్మాణం కోసం రూ.500 కోట్లు కేటాయించారని తెలిపారు. సీఎం కేసీఆర్ చొరవతోనే గజ్వేల్లో షాదీఖానా, షాపింగ్ కాంప్లెక్సు నిర్మాణంతోపాటు రెండు మైనార్టీ గురుకులాలు ఏర్పాటు చేశామని చెప్పారు. ఆర్యవైశ్యులకు అన్ని రంగాల్లో సీఎం కేసీఆర్ సముచిత గౌరవాన్ని కల్పిస్తున్నారని వెల్లడించారు. సీఎం కేసీఆర్ అన్ని వర్గాలను అభివృద్ధి చేస్తున్నారని, రాష్ర్టాన్ని మరో 20 ఏండ్లు పాలించేలా సీఎం కేసీఆర్ను ప్రజలు ఆశీర్వదించాలని ఎక్సైజ్శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ కోరారు. 70 ఏండ్ల పరిపాలనలో ఆదాయం కోసమే ఆబ్కారీని సమైక్య పాలకులు వాడుకున్నారే తప్పా.. సరైన కార్యాలయాలు కూడా ఏర్పాటు చేయలేదని ఆరోపించారు. కార్యక్రమాల్లో మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్రెడ్డి, ఎమ్మెల్సీ ఫారూఖ్ హుస్సేన్, ఎఫ్డీసీ చైర్మన్ వంటేరు ప్రతాప్రెడ్డి, జడ్పీ చైర్పర్సన్ రోజాశర్మ, టూరిజం కార్పొరేషన్ చైర్మన్ శ్రీనివాస్ గుప్త్తా తదితరులు పాల్గొన్నారు.