ఖమ్మం రూరల్, ఆగస్టు 16: ప్రత్యర్థుల చేతిలో దారుణ హత్యకు గురైన ఖమ్మం జిల్లా తెల్దారుపల్లికి చెందిన టీఆర్ఎస్ సీనియర్ నేత తమ్మినేని కృష్ణయ్య అంతిమయాత్ర మంగళవారం అశ్రునయనాల మధ్య ముగిసింది. గుర్తుతెలియని దుండగుల చేతిలో తమ్మినేని కృష్ణయ్య సోమవారం దారుణహత్యకు గురైన విషయం తెలిసిందే. మంగళవారం ఉదయం 10 గంటలకు గ్రామంలోని ఆయన స్వగృహం నుంచి అంతియయాత్ర ప్రారంభమైంది. మాజీ మంత్రి, టీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు తుమ్మల నాగేశ్వరరావు, టీఎస్పీఎస్సీ మాజీ సభ్యురాలు బానోత్ చంద్రావతి తదితరులు పాల్గొని నివాళులర్పించారు. తుమ్మల నాగేశ్వరరావు.. కృష్ణయ్య పాడె మోశారు. అభిమాన నాయకుడి చివరిచూపు కోసం చుట్టుపక్కల గ్రామాల నుంచి ప్రజలు భారీగా తరలివచ్చి కన్నీటి వీడ్కోలు పలికారు. గ్రామంలో అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.