హైదరాబాద్ : నగరంలోని గచ్చిబౌలి క్రీడాప్రాంగణాన్ని అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా ఆధునికీకరించడానికి రూ.52 కోట్లు కేటాయించాలని టీఆర్ఎస్ ఎంపీ రంజిత్రెడ్డి కేంద్రాన్ని కోరారు. మంగళవారం ఆయన లోక్సభ జీరో అవర్లో మాట్లాడుతూ.. ఇందుకు సంబంధించిన ప్రతిపాదనలను రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి పంపిన విషయాన్ని గుర్తుచేశారు. 90 ఎకరాలున్న ఈ స్టేడియం అంతర్జాతీయ స్థాయిలో ఇండోర్, ఔట్డోర్ క్రీడలు నిర్వహించేందుకు అనుకూలమని పేర్కొన్నారు.
గతంలో ఇక్కడ 32వ జాతీయ క్రీడలు, ఆఫ్రో ఏషియన్ గేమ్స్, వరల్డ్ మిలిటరీ గేమ్స్ నిర్వహించారని చెప్పారు. ఒలింపిక్స్ రజిత పతక విజేత పీవీ సింధు ఈ స్టేడియంలోనే ప్రాక్టీస్ చేశారని, దీనిని ఆధునికీకరించడం వల్ల మరికొంతమంది అంతర్జాతీయ క్రీడాకారులుగా ఎదిగేందుకు తోడ్పుడుతుందని పేర్కొన్నారు. సానుకూలంగా స్పందించిన క్రీడాశాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని హామీ ఇచ్చారు.