హైదరాబాద్, మే 18 (నమస్తే తెలంగాణ): పర్యావరణ కాలుష్యానికి విరుగుడు కనిపెట్టాలన్న ఆలోచనతోనే బయోడిగ్రేడబుల్ క్యారీబ్యాగ్ రూపొందించినట్టు డీఆర్డీఓ శాస్త్రవేత్త వీరబ్రహ్మం తెలిపారు. తొలుత 2015లో ఎంతో స్టడీ తర్వాత పాలివినైల్ ఆల్కహాల్ బేస్డ్ ఫార్ములేషన్తో ఒక ఫార్ములాను రూపొందించినట్టు వివరించారు. కానీ దానితో తయారు చేసిన వస్తువుల్లోనూ విషవ్యర్థాలు ఉండడంతో వదిలిపెట్టామన్నారు. రెండో ప్రయత్నంగా క్యాల్షియం కార్బొనేట్ మినరల్స్, పాలిలాక్టిక్యాసిడ్స్ కాంబినేషన్లను వివిధ నిష్పత్తులతో కలుపుతూ చివరకు ఆ పదార్థంతో తయారుచేసిన బ్యాగ్లు బరువును మోయడంతోపాటు భూమిలోనూ 90 నుంచి 180 రోజుల్లోనే కలిసి పోతున్నట్టు గుర్తించామన్నారు.
అవి కేవలం మూడునెలల్లోనే మట్టిలో కలిసిపోవడంతో తమ ఫార్ములా విజయవంతమైందని వీరబ్రహ్మం పేర్కొన్నారు. తొలుత చర్లపల్లిలోని ఎకోలాస్టిక్ పరిశ్రమతో వీటి తయారీ ప్రారంభించినట్టు తెలిపారు. ‘మేం తయారు చేసిన ఈ కవర్లలో ఏమాత్రం పాలీఇథిలీన్ పదార్థాలు కలిసి ఉండవు, కేవలం బయోడిగ్రేడబుల్ స్టార్చ్ ఉంటుంది. స్టార్చ్ కూడా మొక్కజొన్న, కూరగాయల వ్యర్థాలు, కూరగాయ వ్యర్థాల నుంచి తీసిన చేసిన ఆయిల్స్తో తయారు చేస్తున్నాం. మొదట జిగట వచ్చే మొక్కజొన్న తదితర పదార్థాలను తీసుకుని వాటిని పౌడర్లా చేస్తాం. తర్వాత దాన్ని ప్రాసెస్ చేసి పెల్లెట్స్గా మార్చుతాం. దానికి తిరిగి కొన్ని రకాల పదార్థాలు కలిపి ఫైనల్గా వచ్చిన పదార్థంతో మనకు కావాల్సిన కవర్లను తయారుచేస్తాం.
ఇందులో మళ్లీ నీటిలో కరిగే కవర్లు.. నీటిని తట్టుకునేవి అని రెండు రకాలు తయారుచేశాం. రెండు కూడా భూమిలో 90 నుంచి 180 రోజుల్లోనే పూర్తిగా కలిసిపోతాయి. వీటిని చేపలు, ఆవుల వంటి ఇతర జంతువులు తిన్నా ఎలాంటి హానికలగదు’ అని తెలిపారు. తన తోటి శాస్త్రవేత్త పద్మనాభరాజు, డీఆర్డీఓ ఏఎస్ఎల్ డైరెక్టర్ ఎం రామమనోహర్ బాబు సహకారం, డీఆర్డీఓ చైర్మన్ సతీశ్రెడ్డి ప్రోత్సాహంతో వీటిని రూపొందించినట్టు తెలిపారు. మార్కెట్లో సాధారణంగా దొరికే పాలీఇథిలిన్ కవరుకు రూపాయి ధర ఉంటే తాము తయారు చేసిన బయో కంపోస్టబుల్ బ్యాగ్ల ధర రూ.1.25 నుంచి రూ.2 వరకు ఉండొచ్చని పేర్కొన్నారు.