Niloufer Hospital | హైదరాబాద్ సిటీబ్యూరో, ఏప్రిల్ 18 (నమస్తే తెలంగాణ): ప్రాణాంతకమైన వ్యాధుల్లో హిమోఫీలియా ఒకటి. వంశపార్యపరంగా 70% మందికి, ఆకస్మిక జన్యుమార్పిడి వల్ల 30% మందికి వచ్చే ఈ వ్యాధికి పూర్తిస్థాయి చికిత్స లేదు. జీవితాంతం మందులు వాడాల్సిందేనని వైద్య నిపుణులు స్పష్టం చేస్తున్నారు. ప్రస్తుతం ఈ వ్యాధికి అందుబాటులో ఉన్న చికిత్స తాత్కాలికమైనదేనని, అది కూడా ఎంతో ఖరీదైనదని చెప్తున్నారు. ఈ చికిత్సలో భాగంగా రోగి 1-2 వారాలకోసారి దాదాపు రూ.30 వేల విలువైన ఫ్యాక్టర్స్ ఇంజెక్షన్ను తీసుకోవాల్సి ఉంటుంది. ఏడాదికి రూ.7 లక్షలు ఖర్చయ్యే ఈ ఇంజెక్షన్లను హైదరాబాద్ నిలోఫర్ దవాఖానలో రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగా ఇస్తున్నదని, మార్కెట్లో వీటి విలువ రూ.20 లక్షలకుపైగా ఉంటుందని సూపరింటెండెంట్ డాక్టర్ ఉషారాణి తెలిపారు.
రక్తం గడ్డకట్టకపోవడాన్నే హిమోఫీలియా అంటారు. సాధారణంగా శరీరంలో ఎక్కడైనా గాయమైనప్పుడు కొద్దిసేపు రక్తస్రావమై ఆ తర్వాత ఆగిపోతుంది. అయితే ఈ హిమోఫీలియా వ్యాధి ఉన్నవారిలో రక్తం గడ్డకట్టకుండా నిరంతరం స్రవిస్తూనే ఉంటుంది. దీంతో వారి ప్రాణాలకే ముప్పు ఏర్పడుతుంది. ఎంతో అరుదైన ఈ వ్యాధి 10 వేల మందిలో ఒక్కరికి మాత్రమే వస్తుంది. సకాలంలో గుర్తించి, కొన్ని జాగ్రత్తలు పాటించడం ద్వారా ఈ వ్యాధిని నియంత్రించవచ్చు.
హిమోఫీలియా వ్యాధిలో రెండు రకాలుంటాయని డాక్టర్ ఉషారాణి తెలిపారు. సాధారణంగా రక్తంలో 13 రకాల ఫ్యాక్టర్స్ ఉంటాయని, అవి సక్రమంగా పనిచేస్తేనే ఏదైన గాయమైనప్పుడు రక్తం గడ్డకడుతుందని వివరించారు. రక్తంలోని క్లాటింగ్ ఫ్యాక్టర్-8 ఉత్పత్తి కాకపోతే హిమోఫీలియా-ఏ వ్యాధి, క్లాటింగ్ ఫ్యాక్టర్-9 లోపం వల్ల హిమోఫీలియా-బీ వ్యాధి సంభవిస్తుందని, ఈ రెండు రకాల వ్యాధులు ఎక్కువగా మగవారిలోనే వస్తుంటాయని చెప్పారు. క్లాటింగ్ ఫ్యాక్టర్-9 లోపం వల్ల మహిళలు, పురుషుల్లో హిమోఫీలియా-సీ వ్యాధి వస్తుందని తెలిపారు.
హిమోఫీలియా సమస్యతో ప్రతి 15 రోజులకు దాదాపు 15 మంది పిల్లలు మా దవాఖానకు వస్తుంటారు. వీరి వయసు 3 నెలల నుంచి 10 ఏండ్ల వరకు ఉంటుంది. వీరు కాకుండా మరో 30 మంది రోగులు తీవ్ర రక్తస్రావంతో వస్తుంటారు. ఇలాంటివారికి ఏడాది పాటు ఫ్యాక్టర్ డోస్ ఇంజెక్షన్లను ఇవ్వాల్సి ఉంటుంది. రూ.7 లక్షల ఖరీదైన ఈ ఇంజెక్షన్లను నిలోఫర్ దవాఖానలో ఉచితంగా ఇస్తున్నాం. ఇందుకోసం ప్రభుత్వం దాదాపు 45 మంది రోగులకు రూ.20 లక్షల చొప్పున ఖర్చు చేస్తున్నది. వంశపారంపర్యంగా వచ్చే ఈ వ్యాధిని ప్రారంభంలోనే గుర్తించవచ్చు. మహిళలు గర్భం దాల్చిన వెంటనే హిమోఫీలియా పరీక్షలు చేయించుకోవడం ఉత్తమం. సకాంలో ఈ వ్యాధిని గుర్తించకపోతే ప్రాణనష్టం తప్పదు. – డాక్టర్ ఉషారాణి, సూపరింటెండెంట్, నిలోఫర్ దవాఖాన