హైదరాబాద్, అక్టోబర్ 3 (నమస్తే తెలంగాణ): బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. దీని ప్రభావంతో మంగళవారం నుంచి నాలుగు రోజులపాటు పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. పశ్చిమ బంగాళాఖాతంలో స్థిరంగా కొనసాగుతున్న ఆవర్తనం ప్రభావంతో సోమవారం పశ్చిమ మధ్య బంగాళాఖాతం పరిసర ప్రాంతాల్లో అల్పపీడనం ఏర్పడింది. దీనికి అనుబంధంగా ఉన్న ఆవర్తనం సముద్రమట్టానికి 5.8 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి నైరుతి దిశగా వంపు తిరిగి ఉన్నది. ఇది రెండు రోజుల్లో పశ్చిమ వాయవ్య దిశగా కదిలి ఆంధ్రప్రదేశ్ తీరం వైపు వచ్చే అవకాశం ఉన్నదని వివరించింది. వర్షాలు కురిసే అవకాశముండటంతో ప్రాథమిక హెచ్చరిక జారీ చేసింది.