నల్లగొండ: నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు వరద ప్రవాహం కొద్దిగా పెరిగింది. దీంతో అధికారులు నాలుగు క్రస్ట్ గేట్లు ఎత్తి దిగువకు నీటి విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టులోకి ప్రస్తుతం 79,508 క్యూసెక్కుల నీరు వస్తున్నది. అంతే మొత్తంలో దిగువకు వదులుతున్నారు.
సాగర్ పూర్తిస్థాయి సామర్థ్యం 312.0450 టీఎంసీలు. ప్రస్తుతం 311.74 టీఎంసీల నీరు నిల్వ ఉన్నది. జలాశయం గరిష్ఠ నీటిమట్టం 590 అడుగులకుగాను 589.90 అడుగుల వద్ద నీటిమట్టం ఉన్నది.
ఇక దిగువన ఉన్న పులిచింతల ప్రాజెక్టుకు వరద కొనసాగుతున్నది. ఎగువ నుంచి భారీగా వరద వస్తుండటంతో అధికారులు ఐదు గేట్లు ఎత్తి నీటి విడుదల చేస్తున్నారు. జలాశయంలోకి 60,548 క్యూసెక్కుల నీరు వస్తుండగా, 60,638 క్యూసెక్కుల నీరు వెల్తున్నది. పులిచింతల నీటి నిల్వ సామర్థ్యం 45.77 టీఎంసీలు, 32.50 టీఎంసీల నీరు నిల్వ ఉన్నది. పూర్తి స్థాయి నీటిమట్టం 175 అడుగులు కాగా, ప్రస్తుతం 165.68 అడుగుల వద్ద నీటిమట్టం ఉన్నది.