ఖైరతాబాద్, మార్చి 13: ఫోన్ ట్యాపింగ్ కేసులో స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్ (ఎస్ఐబీ) మాజీ డీఎస్పీ దుగ్యాల ప్రణీత్రావుకు నాంపల్లి కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. దాంతో ఆయనను పంజాగుట్ట పోలీసులు చంచల్గూడ జైలుకు తరలించారు. ఎస్ఐబీలో కీలక సమాచారాన్ని ధ్వంసం చేశారనే ఆరోపణలతో పంజాగుట్ట పోలీసులు ఆయనపై కేసు నమోదుచేసిన విషయం తెలిసిందే. అంతర్గత విచారణలో ఆధారాలు లభించడంతో ఈ నెల 4వ తేదీనే అధికారులు ఆయనను సస్పెండ్ చేశారు. ఈ కేసులో మంగళవారం రాత్రి సిరిసిల్లలో అరెస్టు చేసిన పోలీసులు బుధవారం ఆయనను హైదరాబాద్కు తరలించారు. కోర్టులో ప్రవేశపెట్టి జడ్జి ఆదేశాలతో రిమాండ్కు తరలించారు.
వ్యాపారవేత్త మరో ఫిర్యాదు
ప్రణీత్రావుపై పంజాగుట్ట పోలీస్స్టేషన్లో మరో ఫోన్ ట్యాపింగ్ కేసు నమోదయ్యింది. హైదరాబాద్కు చెందిన కణాల శ్రీధర్రావు అనే వ్యాపారవేత్త ఈ ఫిర్యాదు చేశారు. ఓ సంస్థ అధ్యక్షుడు సాంబశివరావుతో వ్యాపార లావాదేవీలు ఉండగా, పరసర్పర అంగీకారంతో విడిపోయామని శ్రీధర్రావు తెలిపారు. కానీ, ప్రణీత్రావు తన పరపతితో తమ కుటుంబసభ్యుల ఫోన్లు ట్యాపింగ్ చేయించి వేధింపులకు గురిచేశాడని, ఇతర వ్యాపారాల్లో తలదూర్చి బ్లాక్మెయిళ్లకు పాల్పడ్డాడని శ్రీధర్రావు చేసిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.