ఒక ప్రాజెక్టు డిమాండ్గా మొదలై కార్యరూపం దాల్చేందుకు దశాబ్దాలు. దానికి ప్రభుత్వామోదం తెలిపేందుకు మరో దశాబ్దం. సర్వేలు, డీపీఆర్ తయారీ, పనులు మొదలుపెట్టేందుకు ఇంకొన్నేండ్లు. అవీ పూర్తిగా సాగుతాయా అంటే అదీ లేదు. పర్యావరణ అనుమతులు, భూసేకరణ చిక్కుముళ్లు వెరసి పనులు పత్రాలపై నిలిచిపోవాల్సిందే. ఇవీ తెలంగాణ ప్రాజెక్టులపై దశాబ్దాలుగా సీమాంధ్ర పాలకులు అనుసరించిన కుట్రపూరిత విధానాలు.
స్వరాష్ట్రంలో కూడా అవే విధానాలు అమలు చేయాలా? నీళ్ల కోసమే ఉద్యమించి సాధించుకున్న తెలంగాణ రాష్ర్టానికి ఆ ఫలాలు దక్కకుండా ఏండ్లపాటు ఎదురుచూడాలా? జలదోపిడీపై ఉద్యమనేతగా గర్జించిన కేసీఆర్ తిరిగి ఆ విధానాలనే అమలు చేయలేదనడం, వాటినే ఇప్పుడు మహా మేథావి వెదిరె శ్రీరాం లోపాలుగా చూపేందుకు యత్నించడం విడ్డూరంగా ఉంది. ఒక్క విషయం స్పష్టంగా చెప్పదల్చుకున్న సీమాంధ్ర పాలకులు అనుసరించిన విధానాలకు కేసీఆర్ స్వస్తి పలికారే తప్ప ప్రాజెక్టు నిర్మాణానికి అనుసరించాల్సిన విధానాలకు కాదు. సాంకేతిక అంశాలపై వెదిరె చేస్తున్న ఆరోపణలన్నీ అబద్దాలే. కేవలం తాను అంటకాగుతున్న పార్టీకి పార్లమెంట్ ఎన్నికల్లో లబ్ధి చేకూర్చేందుకే..
ఎన్నికల వేళ బీజేపీకి లబ్ధి చేకూర్చే లక్ష్యంతో వెదిరె శ్రీరాం అబద్దాలతో కేసీఆర్ ప్రతిష్టను మసకబర్చాలనే దుర్భుద్ధితో కాళేశ్వరం ప్రాజెక్టుపై టెక్నికల్ అంశాల ముసుగులో పిచ్చిరాతలు రాస్తున్నారు. సాగునీటిశాఖ ఇంజినీర్లకు మాత్రమే విషయ పరిజ్ఞానం ఉండే హైడ్రాలిక్ జంప్, వెలాసిటీ జియో టెక్నికల్ తదితర అంశాలపై అసత్యపు రాతలను ఆంధ్రజ్యోతి దినపత్రికలో వరుసగా రాయడం తెలంగాణ ప్రజల్లో కాళేశ్వరం ప్రాజెక్టు, బరాజ్ల నిర్మాణాలపై గందరగోళాన్ని రేపే కుట్రలో భాగమే.
టెక్నికల్ అంశాలపై కేంద్ర ప్రభుత్వ సలహాదారుగా రాష్ట్ర ప్రభుత్వానికేమైనా సలహాలివ్వాలని భావిస్తే నేరుగా లేదంటే తన జల్శక్తి మంత్రిత్వశాఖ పరిధిలో ఉండే నేషనల్ డ్యాం సేఫ్టీ అధికారుల ద్వారా ప్రయత్నించాలి. శ్రీరాం చేసిన ఆరోపణల్లో ప్రధానమైనవి వ్యాప్కోస్కు డీపీఆర్ తయారీకి సమయం ఇవ్వలేదని, సుందిళ్ల 5.4కి.మీ, అన్నారం బరాజ్ను 2.2కి.మీ దిగువకు మార్చారని, సరైన పరిశోధనలు చేయలేదని, పరీక్షల కోసం అవసరమైన బోర్హోల్స్ తవ్వలేదని, మోడల్ స్టడీస్ నిర్వహించలేదని, సీడీవో డాటా లేకుండానే బరాజ్ డిజైన్లు ఇచ్చారని ఇలా ఏవేవో చేస్తున్నారు.
కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ అయి న వ్యాప్కోస్కు దేశవ్యాప్తంగా ఎంతో పేరు ప్రతిష్టలున్నాయి. తాను ప్రాతినిధ్యం వహిస్తున్న కేంద్ర ప్రభుత్వ విభాగమైన వ్యాప్కోస్ ప్రతిష్టను దిగజార్చే ఆరోపణలు చేస్తున్నారు వెదిరె శ్రీరాం. ఒక డ్యామ్ నిర్మించాలంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కేవలం డిటైల్డ్ ప్రాజెక్టు రిపోర్ట్ (డీపీఆర్) తయారీకే ఏడాది, రెండేళ్లు అంతకంటే ఎక్కువే పట్టేది. టెక్నాలజీ బాగా అభివృద్ధి చెందిన 21వ శతాబ్దపు శాటిలైట్ యుగంలో చిన్న చిన్న బరాజ్ల డీపీఆర్ తయారీకి ఏండ్ల తరబడి వేచి ఉండాలా?
పూటకో రైతు బలవన్మరణానికి పాల్పడడం సీమాంధ్ర జలదోపిడీతో వల్లకాడైన తెలంగాణ పల్లెల దుస్థితి అమెరికాలో నివసించే శ్రీరాంకు అంతగా తెలియకపోవచ్చు. దేశానికి అన్నంపెట్టే రైతన్నల ఆత్మహత్యలు కేసీఆర్ను కంటతడి పెట్టించాయి. తెలంగాణ ఉద్యమం కోసం కదిలించాయి. తెలంగాణ ఏర్పాటు తర్వాత ప్రజలు ఆయనకు అధికారాన్ని అప్పగించింది గత పాలకుల్లా (జలయజ్ఞం ప్రాజెక్టులు) డీపీఆర్ల కోసం తీవ్ర జాప్యం చేయాలని కాదు.
కాళేశ్వరం ప్రాజెక్టు లింక్-1లోని బరాజ్లైన మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల కోసం డీపీఆర్లు తయారు చేయాలని వ్యాప్కోస్కు రాష్ట్ర ప్రభుత్వం పనులు అప్పగించింది ఏప్రిల్ 2015లోనే. ఎప్పటికప్పుడు వ్యాప్కోస్ ఇస్తున్న డ్రాఫ్ట్ డీపీఆర్ల ప్రకారమే ప్రాజెక్టుల నిర్మాణంలో తెలంగాణ ప్రభుత్వం వేగం పెంచింది. 2016 ఆగస్టులో కాంట్రాక్టర్లతో ఒప్పందాలు చేసుకున్నది. సుమారు 15నెలల సమయం గరిష్ఠంగా 3 బరాజ్ల డీపీఆర్ల కోసం వ్యాప్కోస్ తీసుకున్నది.
డీపీఆర్లో పేర్కొన్న స్థలాల్లో కాకుండా సుందిళ్ల బరాజ్ నిర్మాణ స్థలాన్ని 5.4కిమీ, అన్నారం బరాజ్ని 2.2కిమీ మీటర్ల దిగువకు మార్చి ఎలాంటి భౌతిక పరిశోధనలు, మోడల్ స్టడీస్ లేకుండా నిర్మించారని అసత్యాలతో పాఠకులను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేశారు శ్రీరాం. స్థలాలను ఎందుకు మార్చాల్సి వచ్చిందో ఆయనకు క్షుణ్ణంగా తెలుసు. మోడల్ స్టడీస్, భౌతిక పరిశోధనలు జరుపలేదనడం పచ్చి అబద్ధం.
వ్యాప్కోస్ సంస్థ బరాజ్లను ఎంపిక చేసిన స్థలాల్లో ముంపునకు గురయ్యే అవకాశం ఉన్న 22 వేల ఎకరాల భూములు, గోదావరిఖని, రామగుండం ప్రాంతంలోని గ్రామాలు, అటవీ భూములు, తరతరాలుగా ఆదివాసీ గిరిజనులు పూజించుకుంటున్న గుండ్రాతిపల్లె ఊట్ల పోశమ్మ దేవాలయం ముంపునకు గురవుతాయని రాష్ట్ర ప్రభుత్వం భావించింది. భూ నిర్వాసితులు ప్రతిఘటించే అవకాశం ఉన్నదని, అటవీ భూముల్లో కాల్వ నిర్మాణానికి కేంద్ర పర్యావరణ అటవీ మంత్రిత్వ శాఖల నుంచి అనుమతులు అసాధ్యమని లేదా జాప్యంతో కూడుకున్నదని ప్రభుత్వం భావించింది.
మానేరు నదిలో వానకాలం పదివేల నుంచి ఇరవై వేల క్యూసెక్కుల వరద పోటెత్తుతున్న అంశాన్ని దృష్టిలో పెట్టుకుంటే మానేరు సంగమ స్థలానికి కేవలం 2 కి.మీ.దూరంలో అన్నారం బరాజ్ ఉండటం వల్ల భవిష్యత్తులో బరాజ్కు నష్టం కలిగే అవకాశముంది. ఇలాంటి సహేతుక కారణాల వల్లే నిర్మాణ స్థలాలను రాష్ట్ర ప్రభుత్వం మార్చింది. అలా మార్చడం వల్ల అన్నారం బరాజ్తో 11.81 టీఎంసీలకు బదులు 13.56 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యం పెరిగింది.
సుందిళ్ల బరాజ్ సామర్థ్యం కూడా 5.05 టీఎంసీల నుంచి 8.88 టీఎంసీలకు పెరిగింది. కన్నెపల్లిలో లిఫ్ట్ చేసి అన్నారంలోకి ప్రవహించే గ్రావిటీ కాల్వ పొడవు 2.20 కి.మీ తగ్గింది. ఈ కాల్వ నిడివి తగ్గించకుంటే అటవీ భూముల్లోంచి వేయాల్సి వచ్చేది. సుందిళ్ల బరాజ్ స్థలాన్ని 5.4 కి.మీ దిగువకు మార్చడం వల్ల అన్నారం పంపింగ్ పైప్లైన్ దూరం మరో 5-6 కి.మీ. తగ్గింది. పంపింగ్ దూరం తగ్గడంతో విద్యుత్ వినియోగం కూడా తగ్గింది. సుమారు 25 కి.మీ. పొడవుకు 15 మీ.ఎత్తుతో కరకట్టలు అన్నారానికి ఎగువన నిర్మించడంతో ఊర్లను ముంచకుండా, పొలాలను సేకరించకుండా కాపాడారు.
కరకట్టల కోసం కేవలం 500 ఎకరాలనే ప్రభుత్వం సేకరించింది. కరకట్టలు నిర్మించకుంటే 8 గ్రామా లు, పంట పొలాలు, అటవీ భూములు ముంపునకు గురయ్యేవి. నష్ట పరిహారం వెయ్యి కోట్లుండేది. అన్నారం, సుందిల్ల బరాజ్ స్థలాల్లో భౌతిక పరీక్షలు చేయలేదని శ్రీరామ్ వ్యాఖ్యానించడం ఆయన బాధ్యతారాహిత్యం. హైదరాబాద్ ఐఐటీ ప్రొఫెసర్ ఉమాశంకర్ ప్రత్యక్ష పర్యవేక్షణలో భౌతిక పరిశోధనలు చేశారు.
అన్నారం బరాజ్ నిర్మాణ స్థలంలో వ్కాప్కోస్ ఆరు బోర్హోల్స్ వేసింది. డిపార్ట్మెంట్ మరో 34 వేసింది. ఈ శాంపిల్స్ను వరంగల్ ఎన్ఐటీ, ఐఐటీ హైదరాబాద్, పూణె, తెలంగాణ స్టేట్ ఇంజినీరింగ్ రీసెర్చ్ ల్యాబొరేటరీల్లో పరీక్షించారు. 1.43 కి.మీ. పొడవు ఉన్న సుందిల్ల బరాజ్ స్థలంలో కూడా సుమారు 89 జిగ్జాగ్ బోర్ హోల్స్ వేసి అన్నిరకాల పరీక్షలను డిపార్టుమెంటు, బరాజ్ నిర్మించిన నవయుగ సంస్థ నిర్వహించాయి.
‘పునాది భూగర్భ శాస్త్రం, అక్కడి భౌగోళిక అనిశ్చితిలోని వైవిధ్యాన్ని గుర్తించేందుకు మూడు బ్యారేజీలకు నిర్వహించిన భౌగోళిక పరిశోధనల పరిధి ఎంతమాత్రం సరిపోదు’అని వెదిరె నిర్ధారించారు. అంటే సుమారు 80 ఏండ్లకు పైగా చరిత్ర ఉన్న టీఎస్ఈఆర్ఎల్, దేశంలోనే ప్రధాన ఎన్ఐటీలో ఒకటైన వరంగల్ ఎన్ఐటీ, ప్రముఖ ఐఐటీల్లో ఒకటైన హైదరాబాద్ ఐఐటీ చేసిన పరిశోధనలు శ్రీరాం దృష్టిలో వృథాయేనా?
‘ఎద్దడుగు భూమి ఏడు రకాలుంటది’ అని తెలంగాణ పల్లెల్లో పెద్దలంటారు. మన ఇంజినీర్లకు, పరిశోధకులకు ఈ మాత్రం అవగాహన లేదని శ్రీరామ్ అనుకుంటున్నారా? మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బరాజ్ స్థలాల్లో సుమారు 45-50 మీ. దిగువన నదీ గర్భంలో ఇసుకే ఉన్నది. గట్టిరాయి గాని బండరాళ్లు గాని ఎక్క డా తగల్లేదు. ఎల్లంపల్లి, సమ్మక్క బరాజ్ల వద్ద గట్టిరాయి కొంతమేర ఉంది. జియోటెక్నికల్ సర్వే సందర్భంగా నది గర్భంలో ఎక్కడా అగ్నిశిలలు (ఇగ్నీషియస్ రాక్), అవక్షేపణ శిల లు (సెడిమెంటరీ రాక్), రూపాంతర శిలలు (మెటమార్ఫిక్ రాక్) లేవని పరిశోధకులు నిర్ధారించారు.
అందుకే జియాలజిస్ట్ల అవసరం ఏర్పడలేదు. నదీగర్భంలోని ఇసుక సీపేజ్ (ఊటలు) ఎనాలిసిస్ చేసిన తర్వాత కొద్దిగా ఖర్చు పెరిగినా షీట్పైల్స్కు బదులు సీకెంట్ పైల్స్ నిర్మించాలని నీటిపారుదల రంగ నిపుణులు, ఇంజినీర్లు భావించారు. ఇసుక నమూనాలను ఎన్ఐటీ వరంగల్లో పరీక్షించారు. రెండో అభిప్రాయం కోసం ఐఐటీ మద్రాస్కు వెళ్లి డాక్టర్ నరసింహారావు (జియోటెక్నికల్ హెడ్)తో మరోసారి ఇసుక నమూనాలను పరీక్షింపజేశారు. షీట్స్పైల్స్లో ఇంటర్లాక్ చేసేటప్పుడు గ్యాప్ వచ్చే అవకాశం ఉన్నందున లీకేజీ, తు ప్పు పట్టే అవకాశం ఉన్నందున లేటెస్ట్ అయిన సీకెంట్ పైల్స్ను వాడారు. ఇందులో డీ-వాటరింగ్ సమస్య తలెత్తదు.వీటి నిర్మాణం త్వరగా పూర్తిచేయవచ్చు.సీడీఓ కూడా సీకెంట్ పైల్స్కు అప్రూవల్ ఇచ్చింది.
అన్నారం బరాజ్లో సుమారు 5000 సీకెంట్ పైల్స్తో కటాఫ్ వాల్ నిర్మించారు. దీనిపై మూడు మీటర్ల మందం కలిగిన ఆర్సీసీతో రాఫ్ట్ నిర్మించారు. సీకెంట్ పైల్లోని ఐర న్ రాడ్స్ను రాఫ్ట్తో అనుసంధానం చేశారు. అన్నారం బ్యారేజీలో 5000 సీకెంట్ పైల్స్లో కేవలం నాలుగింటిలోనే కొద్దిగా లీకేజీ రావడం వల్ల కెమికల్ గ్రౌటింగ్ (పాలియురిత్రిన్ బేస్డ్ ఆర్గానిక్ కంపౌండ్) చేసి లీకేజీని ఆపివేశారు. 2020లో మరో రెండింటిలో (44, 35 వెంట్లలో) ఆపివేసిన తర్వాత నేటివరకు చెక్కు చెదరలేదు. రిటైర్డ్ ఈఎన్సీ ప్రొ.రామరాజు పరిశీలించి ‘నీళ్లు లీకవుతూనే ఉంటాయి కానీ ఇసుక రాకుండా చూడాలి’ అని చెప్పారు.
ఈ లీకేజీలో ఇసుక రాలేదు. 2021లో 28, 38 వెంట్లలో మరోసారి లీకేజీ వచ్చింది కానీ ఇసుక రేణువులు రాలేదు. 2022లో 17.50 లక్షల క్యూసెక్కుల డిశ్చార్జి నీరు అన్నారం బరా జ్ నుంచి 5 గంటలకు పైగా ప్రవహించింది. నేటివరకు ఇదే అన్నారం బరాజ్ వద్ద రికార్డు. ఈ వరద ఆగిన తర్వాత మరోసారి 28, 38 వెంట్లను పరిశీలిస్తే లీకేజీ ప్రవాహం పెరగనూ లేదు, ఇసుక రేణువులు రానూ లేదు. 2023 వానకాలంలో 11 లక్షల క్యూసెక్కుల వరద అన్నారం ద్వారా ప్రవహించింది. అయినా లీకేజీ పెరగలేదు, ఇసుక రాలేదు. 2020లో 44, 35 వెంట్లలో లీకేజీ కెమికల్ గ్రౌటింగ్ ద్వారా ఆపినట్లే 2024 ప్రారంభ మాసాల్లో 28, 38 వెంట్ల లీకేజీని కూడా ఆపివేశారు. ఈ లీకేజీనే భూతద్దంలో చూపి సోషల్ మీడియాలో అన్నారంలో బుంగలు పడ్డాయని కాంగ్రెస్ నాయకులు దుష్ప్రచారం చేశారు.
దేశంలో అంత్యంత వేగంగా ప్రవహించే నది గోదావరి అనే వాస్తవాన్ని ముందుగా అంగీకరించాలి. గోదావరి, పెన్గంగ మొదలైన నదులు వేగంగా ప్రవహిస్తూ 100- 130 మీటర్ల లోపు గల మేడిగడ్డ, అన్నారం, సుం దిళ్ల, బరాజ్లకు చేరుతాయి. నీరు ఎప్పు డు అకస్మాత్తుగా పోటెత్తేది అంచనా వేయలేం.
కడెం నదికి అకస్మాత్తుగా వరదలు వచ్చినప్పు డు గేట్లెతి ఎల్లంపల్లికి వదులుతారు. ఎల్లంపల్లి నుంచి సుందిళ్లకు వదలడంతో దిగువన అన్నారంలో టెయిలెండ్ వాటర్ లెవెల్ లేకున్నా గేట్లు తెరిచి నదిలోకి వదలడం వల్ల హైడ్రాలిక్ జంప్ సమస్య ఉత్పన్నమై సిమెంట్ బ్లాకులు కొట్టుకుపోతున్నాయి. సుందిళ్ల, అన్నారం సిమెంట్ బ్లాకులను పునర్నిర్మించినా మళ్లీ కొట్టుకుపోయాయి. ఎలాంటి సమస్యలు ఉత్ప న్నం కాకపోయినా ఈ అనుభవాలను దృష్టిలో పెట్టుకొని వానకాలంలో నీటిని బరాజ్ల వద్ద భారీస్థాయిలో నిల్వ చేయకుండా గేట్లను పూర్తి గా తెరిచి దిగువకు వదులుతున్నారు.
అన్నారం-మేడిగడ్డ మధ్యదూరం ఎక్కువ ఉండటం వల్ల వాటర్ షేక్హ్యాండ్ లేదా టెయిలెండ్ వరకు ఉండేట్లు నిర్వహించడం సాధ్యపడదు. బరాజ్ల తీరుపై నేషనల్ డ్యాం సేఫ్టీ అధికారులతో శ్రీరాం చర్చించి వారి ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి చేరవేస్తే తెలంగాణకు మేలు జరుగుతుంది. 57 ఏండ్ల సమైక్య రాష్ట్రంలో గోదావరి, కృష్ణా ఇతర ఉపనదులపై ఎక్కడా బరాజ్ల నిర్మాణం జరగలేదు. ఇన్ని బరాజ్లను రికార్డు సమయంలో నిర్మించి లక్షలాది ఎకరాల స్థిరీకణ, కొత్త ఆయకట్టు కల్పనలో విజయం సాధించి వరిధాన్యం ఉత్పత్తులను ఆరేడు రెట్లు పెంచి రైతులకు భరోసా కల్పించిన కేసీఆర్ ప్రభుత్వంపై బురదజల్లే ప్రయత్నాలను వెదిరె మానుకోవాలి.
– వీ ప్రకాశ్
(వ్యాసకర్త: తెలంగాణ జలవనరుల అభివృద్ధి సంస్థ మాజీ చైర్మన్)
వరదాయిని కాళేశ్వరం
ఆంధ్రజ్యోతిలో వెదిరె శ్రీరాం రాసిన కాళేశ్వరంపై వ్యాసాలకు వీ ప్రకాశ్ కౌంటర్