హైదరాబాద్ సిటీబ్యూరో, జవనరి 22 (నమస్తే తెలంగాణ): తెలుగు అకాడమీకి చెందిన 65 కోట్ల ఫిక్స్డ్ డిపాజిట్లను కాజేసిన యూనియన్ బ్యాంక్ మేనేజర్ మస్తాన్ వలీని శనివారం హైదరాబాద్ సీసీఎస్ పోలీసులు మరోసారి అరెస్టు చేశారు. తెలంగాణ గిడ్డంగుల సంస్థకు చెందిన రూ.3.98 కోట్ల ఫిక్స్డ్ డిపాజిట్లు కొల్లగొట్టేందుకు నకిలీ ఎఫ్డీలు తయారుచేసిన మోసంలో అదుపులోకి తీసుకున్నట్టు పోలీసులు చెప్పారు. మస్తాన్ వలీ కార్వాన్ యూనియన్ బ్యాంక్ మేనేజర్గా ఉన్న సమయంలో ప్రధాన సూత్రధారి నండూరి వెంకటరమణతో కలిసి నకిలీ ఫిక్స్డ్ డిపాజిట్లను సృష్టించి తెలుగు అకాడమీకి చెందిన రూ.65 కోట్లను దారి మళ్లించాడని వెలుగులోకి వచ్చింది. ఈ కేసులో సీసీఎస్ పోలీసులు వెంటకరమణ, మస్తాన్వలీతోపాటు మరో 20 మందిని అరెస్టు చేసి జైలుకు పంపారు. ఈ నెల 19న చంచల్గూడ జైలు నుంచి మస్తాన్ వలీ విడుదలయ్యాడు.
రాష్ట్ర గిడ్డంగుల సంస్థ నకిలీ ఫిక్స్డ్ డిపాజిట్ల తయారీ కేసులో 21న మరోసారి సీసీఎస్ పోలీసులు అరెస్టు చేసి శనివారం చంచల్గూడ జైలుకు పంపారు. మస్తాన్ వలీ కార్వాన్ యూనియన్ బ్యాంకులో పనిచేసే సమయంలో రాష్ట్ర గిడ్డంగుల సంస్థకు చెందిన రెండు ఫిక్స్డ్ డిపాజిట్లు (ఒక ఎఫ్డీ 1.99 కోట్లు) కొట్టేసేందుకు పథకం వేశాడు. వాటిపై గతేడాది జనవరి 6, 7 తేదీలున్నాయని గమనించి నకిలీ ఎఫ్డీలను సృష్టించి గిడ్డంగుల సంస్థకు అందించాడు. అసలు ఎఫ్డీలను ప్రధాన సూత్రధారి నండూరి వెంటరమణకు ఇచ్చాడని పోలీసుల విచారణలో బయటపడింది. గిడ్డంగుల సంస్థ అధికారులు ఫిర్యాదుతో సీసీఎస్ పోలీసులు విచారణను వేగంగా చేశారు. విచారణలో గిడ్డంగుల సంస్థకు చెందిన ఎఫ్డీలు విత్డ్రా కాలేదని, రూ.3.98 కోట్లు బ్యాంక్లో భద్రంగా ఉన్నాయని సీసీఎస్ జాయింట్ కమిషనర్ తెలిపారు.