హైదరాబాద్, జనవరి 22 (నమస్తే తెలంగాణ): ఆదివాసీ మహిళల జోలికెళ్తే సహించేది లేదని రాష్ట్ర గిరిజన, స్త్రీ, శిశు సంక్షేమశాఖల మంత్రి సత్యవతి రాథోడ్ హెచ్చరించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లి మండలంలోని ఆదివాసీగూడెం సాకివాగుకు చెందిన ముగ్గురు ఆదివాసీ మహిళలపై ఫారెస్ట్ బీట్గార్డులు అమానుషంగా ప్రవర్తించారనే సంఘటనపై ఆమె తీవ్రంగా స్పందించారు. దీనిపై సమగ్ర విచారణ జరిపి, నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని గిరిజన సంక్షేమశాఖ కమిషనర్ను ఆదేశించారు. జీవనాధారంలో భాగంగా అటవీ ఉత్పత్తుల కోసం అడవిలోకి వెళ్లే ఆదివాసీల జోలికి వెళ్లొద్దని పలుసార్లు హెచ్చరించినా, కొంతమంది అధికారులు అతి చర్యలకు పాల్పడుతున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఇటువంటి చర్యలకు పాల్పడితే ఉపేక్షించేది లేదని చెప్పారు. ఆదివాసీ మహిళలకు ప్రభుత్వం అండగా ఉంటుందని, వారికి అన్నివిధాల న్యాయం చేస్తుందని హామీఇచ్చారు. సాకివాగు ఘటనపై విచారణ జరిపి, నివేదిక ఇవ్వాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఐటీడీఏ పీవోకు గిరిజన సంక్షేమశాఖ కమిషనర్ ఆదేశాలు జారీచేశారు.