హైదరాబాద్, ఫిబ్రవరి 22 (నమస్తే తెలంగాణ): కొవిడ్ తర్వాత చైనా నుంచి బయటకు వస్తున్న బయోఫార్మా కంపెనీలు హైదరాబాద్ వైపు చూస్తున్నాయి. జీనోమ్వ్యాలీలో తమ కేంద్రాలను ఏర్పాటు చేసేందుకు ఆసక్తి చూపుతున్నాయి. కొన్ని కంపెనీలు పరిశోధనలకు సంబంధించి చైనాలోని యూనిట్లతో ఉన్న ఒప్పందాలను రద్దు చేసుకొని, హైదరాబాద్లోని కంపెనీలతో కొత్తగా ఒప్పందాలు చేసుకుంటున్నట్టు సీనియర్ అధికారి ఒకరు చెప్పారు.
కొవిడ్ తర్వాత జీనోమ్ వ్యాలీలో వ్యాపార లావాదేవీలు 20-30 శాతం పెరిగాయని చెప్తున్నారు. దీంతో వ్యాలీలో భూములకు విపరీతమైన డిమాండ్ పెరిగిందని, ఇప్పటికే ఉన్న 1,300 ఎకరాల్లో కంపెనీలు నిండిపోయాయని చెప్తున్నారు. కొన్ని కంపెనీలు వ్యాలీ చుట్టుపక్కల గ్రామాల్లో నుంచి భూములు కొనుగోలు చేసేందుకు ప్రైవేట్ వ్యక్తులను సంప్రదిస్తున్నాయని తెలిపారు. వారే భూమి కొనుగోలు చేసి, వాటిని అభివృద్ధి చేయాలని టీఎస్ఐఐసీని కోరుతున్నారని అంటున్నారు. ఇలా ప్రపంచ కంపెనీల చూపు హైదరాబాద్పై ఉండటానికి కొన్ని ప్రత్యేక కారణాలు ఉన్నట్టు వెల్లడించారు.
అందుబాటులోనే మార్కెట్..:
జీనోమ్ వ్యాలీలో పరిశోధనలు చేసి విజయవంతంగా ఒక వ్యాక్సిన్ లేదా ఔషధాన్ని అభివృద్ధి చేస్తే.. దానిని ఉత్పత్తి చేయడం, ఎగుమతి చేయడం, మార్కెట్ చేయడం వంటి అవకాశాలన్నీ ఇక్కడే ఉన్నాయి. విజయవంతమైన మాలిక్యూల్స్ను కొనుగోలు చేసి, ఉత్పత్తి చేసి, దేశ విదేశాలకు పంపిణీ చేసేందుకు అనేక దేశ, విదేశీ కంపెనీలు ఇక్కడ సిద్ధంగా ఉన్నాయి. స్టార్టప్లలో పెట్టుబడులు పెట్టేందుకు కూడా ఇక్కడ పదుల సంఖ్యలో కంపెనీలు సిద్ధంగా ఉన్నాయి.