పాలకుర్తి, డిసెంబర్ 31: పాల్కురికి సోమనాథుడి తత్వం, సామాజిక సేవ తరతరాలకు ఆదర్శమని, మహాకవి జన్మించిన ఈ నేలను సందర్శిస్తే తనువు పులకరిస్తుందని తెలుగు విశ్వవిద్యాలయ వైస్ చాన్స్లర్ ప్రొఫెసర్ తంగెడ కిషన్రావు అన్నారు. తెలంగాణ ఆదికవి పాల్కురికి సోమనాథుడి పేరిట ఏర్పాటుచేసిన సోమనాథ కళాపీఠం సాహిత్య సాంస్కృతిక వేదిక ఆధ్వర్యంలో ఆదివారం పాలకుర్తిలో సాహితీరంగంలో సేవలందిస్తున్న రచయితలు, కవులకు 2021-22 దైవార్షిక పురస్కారాలు అందించారు. కళాపీఠం అధ్యక్షుడు డాక్టర్ రాపోలు సత్యనారాయణ అధ్యక్షతన నిర్వహించిన సభకు ముఖ్యఅతిథిగా హాజరైన ప్రొఫెసర్ తంగెడ కిషన్రావు మాట్లాడుతూ.. సోమనాథుడి సాహిత్యం అందరికీ ప్రేరణగా నిలిచిందని అన్నారు. సోమనాథుడి కావ్యాలు, సాహితీరంగానికి అందించిన సేవలు మార్గదర్శకమని కొనియాడారు. మహాకవులు సోమనాథుడు, బమ్మెర పోతన నడయాడిన నేలలో పురస్కారాలు అందించడం స్ఫూర్తిదాయకమని అన్నారు.
సాహితీరంగంలో సేవలందిస్తున్న కవులు, రచయితలకు సోమనాథ కళాపీఠం పురస్కారాలను ప్రదానం చేసింది. సోమనాథ సాహిత్య పురస్కారాన్ని డాక్టర్ కానుకుర్తిశెట్టి సోమశేఖర్కు, సోమనాథ సామాజిక శోధన పురస్కారాన్ని డాక్టర్ నలిమెల భాస్కర్కు, సోమనాథ రంగస్థల పురస్కారాన్ని మంచాల రమేశ్కు అందజేశారు. పందిళ్ల శేఖర్బాబు రాజయ్యశాస్త్రి స్వచ్ఛంద భాషా సేవ పురస్కారాన్ని డాక్టర్ మైథిలి అబ్బరాజుకు, వీరమనేని చలపతిరావు సాహిత్య పురస్కారాన్ని ఎంఎస్ఆర్ వెంకటరమణకు, ముశం దామోదర్రావు ప్రాచీన చరిత్ర వైజ్ఞానిక పరిశోధన పురస్కారాన్ని డాక్టర్ సీఎస్ఆర్ ప్రభుకు, డాక్టర్ రాపోలు సోమయ్య ప్రతిభా పురస్కారాన్ని డాక్టర్ అరూరి మహేందర్కు, దేవగిరి రాజయ్య స్మారక బిరుదును బూస రేణుకారాధ్యకు అందజేశారు. పొట్లపల్లి సాయిసింధు ప్రదర్శించిన నృత్యం సభికులను అలరించింది.