గంభీరావుపేట, ఆగస్టు 30: ఎనిమిది నెలల చిన్నారికి ఊయలే ఉరితాడుగా మారింది. రాజన్న సిరిసిల్ల జిలా గంభీరావుపేట మండలం ముస్తఫానగర్కు చెందిన బండ దిలీప్ -కళ్యాణి దంపతులకు మూడేండ్ల బాబు, రెండో సంతానంగా పాప పుట్టింది. ప్రస్తుతం ఆ పాప (ఐరా)కు ఎనిమిది నెలలు.
మంగళవారం ఉదయం తల్లి ఐరాను ఊయలలో పడుకోబెట్టి ఇంటి పని చేసుకొంటున్నది. పడుకొన్న పాప ఒక్కసారిగా కేకలు వేస్తూ ఏడుస్తున్నది. గమనించిన తల్లిదండ్రులు వెళ్లి చూసేసరికి ఊయల తాడు మెడకు చుట్టుకొని పాప ఉక్కిరిబిక్కిరవుతున్నది. ప్రాణాపాయ స్థితిలో ఉన్న పాపను వెంటనే ఎల్లారెడ్డిపేట ప్రైవేటు దవాఖానకు తీసుకెళ్లగా అప్పటికే మరణించినట్టు వైద్యులు తెలిపారు. కన్న బిడ్డ కండ్ల ముందే ప్రాణాలు కోల్పోవడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు.