హైదరాబాద్ సిటీబ్యూరో, ఏప్రిల్ 14 (నమస్తే తెలంగాణ): బ్యాంకుల్లో ఉన్న ప్రజల సొమ్ముకు రక్షణ కల్పించాల్సిన బాధ్యత ఆయా యాజమాన్యాలపైనే ఉంటుందని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ పేర్కొన్నారు. గురువారం రిజర్వ్బ్యాంక్, హైదరాబాద్ నగర పోలీసులు సంయుక్తంగా 51 అర్బన్ కోఆపరేటివ్ బ్యాంకుల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీవీ ఆనంద్ మాట్లాడుతూ.. బ్యాంకుల్లో సైబర్ సెక్యూరిటీ లోపాలను ఏపీ మహేశ్ కో ఆపరేటివ్ బ్యాంకు ఉదంతం బయటపెట్టిందని వివరించారు. సైబర్ సెక్యూరిటీపై యాజమాన్యం దృష్టి పెట్టకపోవడం వల్లనే సైబర్ నేరగాళ్లు డాటాబేస్ను హ్యాక్ చేయగలిగారని పేర్కొన్నారు. సైబర్ సెక్యూరిటీని సక్రమంగా పాటించని బ్యాంకులు క్రిమినల్ చట్టాల ప్రకారం శిక్షకు అర్హులవుతాయని వివరించారు. సైబర్ సెక్యూరిటీ పాటించని వారిపై క్రిమినల్ చర్యలు తీసుకొనేలా ఆర్బీఐ కఠిన నిర్ణయాలు తీసుకోవాలని సూచించారు. బ్యాంకులు సైబర్ సెక్యూరిటీ కోసం తగిన బడ్జెట్ను కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. ఆర్బీఐ చీఫ్ జనరల్ మేనేజర్ రాజన్, తెలంగాణ రీజినల్ డైరెక్టర్ నిఖిల మాట్లాడుతూ.. సైబర్సెక్యూరిటీ విషయంలో బ్యాంకులు పటిష్ఠ చర్యలు తీసుకోవాలని సూచించారు. ఆర్బీఐ కూడా సైబర్ సెక్యూరిటీపై దేశవ్యాప్తంగా ఉన్న బ్యాంకులను అప్రమత్తం చేస్తున్నదని పేర్కొన్నారు.