హైదరాబాద్, జూలై 17 (నమస్తే తెలంగాణ): ఆగర్భ శత్రువైనా ఆపదలో ఉంటే అయ్యో అని సానుభూతి చూపటం మానవత్వం. ఇక ప్రజలిచ్చిన అధికారాన్ని అనుభవించే నాయకుడైతే ఆ ప్రజలకు చిన్న కష్టమొచ్చినా స్పందించాలి.. పరామర్శించాలి.. ఆదుకోవాలి. ఇది కనీస ధర్మం.. గురుతర బాధ్యత. కానీ ధర్మానికి ప్రతినిధులమని చెప్పుకొనే కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ పెద్దలు అధర్మానికి ప్రతినిధులుగా మారారు. బీజేపీ అధికారంలో ఉన్న రాష్ర్టాలు, వారు చెప్పినట్టు వినే రాష్ర్టాల్లో ప్రకృతి విపత్తులు వస్తేనే స్పందిస్తున్నారు. తెలంగాణ లాంటి ఇతర రాష్ర్టాల్లో ఎన్ని విపత్తులు, కష్టాలు వచ్చినా కనీసం సానుభూతి కూడా చూపకుండా దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారు.
ప్రకృతి వైపరీత్యాలతో దేశంలోని ఏ మూల నష్టం జరిగినా కేంద్ర ప్రభుత్వం ఆదుకోవాలి. కష్ట సమయంలో కేంద్రం నుంచి ఆర్థిక దన్ను పొందటం ప్రజల హక్కు. గతంలో కేంద్రంలో అధికారం చెలాయించిన ప్రభుత్వాలు ఈ బాధ్యతను కొంతలో కొంత సక్రమంగానే నిర్వర్తించాయి. కానీ, ప్రస్తుత మోదీ సర్కారు తనకు రాజకీయ ప్రయోజనాలే ముఖ్యమని విపత్తుల సమయంలో కూడా నిరూపిస్తున్నది. రాష్ర్టాల్లో తుఫాన్లు, భారీ వర్షాలు, వరదలు, ఇతర విపత్తులు వచ్చినప్పుడు ఆయా రాష్ట్ర ముఖ్యమంత్రులతో ప్రధాని స్వయంగా మాట్లాడి భరోసా ఇవ్వటం సంప్రదాయం. ప్రధాని మోదీ ఈ సంప్రదాయాన్ని ఇప్పుడు బీజేపీ పాలిత రాష్ర్టాలకే పరిమితం చేశారు. గుజరాత్, కర్ణాటక, అస్సాం, ఉత్తరాఖండ్లో వరదలు వచ్చినప్పుడు ఆ రాష్ర్టాల సీఎంలకు ప్రధాని మోదీ ఫోన్ చేసి నష్టంపై ఆరా తీసి కేంద్రం ఆదుకుంటుందని హామీ ఇచ్చారు. కేంద్ర హోంమంత్రి అమిత్షా అధ్యక్షతన గల ఎన్డీఆర్ఎఫ్ సమావేశమై ప్రధాని హామీ మేరకు నిధులు కూడా మంజూరు చేసింది. గుజరాత్, మధ్యప్రదేశ్, ఉత్తరాఖండ్, అస్సాం, కర్ణాటక, పశ్చిమబెంగాల్కు కలిపి 2021 డిసెంబర్ 30న 3,063 కోట్లు విడుదల చేసింది. ఇందులో బీజేపీయేతర రాష్ట్రం పశ్చిమబెంగాల్కు మొక్కుబడిగా రూ. 300 కోట్లు ఇచ్చి, మోదీ సొంత రాష్ట్రం గుజరాత్కు రూ.1,000 కోట్లు ఇవ్వటం గమనార్హం. కేంద్రానికి అనుకూలంగా ఉండే రాష్ర్టాలకు రూ.1,664 కోట్ల సాయం చేసింది. తెలంగాణలో ఎన్నిసార్లు ప్రకృతి విపత్తులు వచ్చినా ప్రధాని స్పందించలేదు. 2020లో హైదరాబాద్ను వరదలు ముంచెత్తి అపార నష్టం జరిగినా కేంద్రం దమ్మిడీ సాయం చేయలేదు. ఈ సంఘటన తర్వాత ఎన్డీఆర్ఎఫ్ పలు దఫాలుగా బీజేపీ పాలిత రాష్ర్టాలకు వేలకోట్లు ఇచ్చింది. అయినా, తెలంగాణను కనీసం పట్టించుకోలేదు. తాజాగా వందేండ్ల రికార్డు స్థాయి వర్షాలతో గోదావరి నది పోటెత్తి పరీవాహక ప్రాంతం అల్లకల్లోలమైంది. ఇంత నష్టం జరిగినప్పటికీ రాష్ట్ర సీఎంకు ప్రధాని మోదీ కనీసం ఫోన్ చేసి ఆరా తీసిన పాపాన పోలేదు. రాష్ట్ర బీజేపీ నేతలు నిత్యం అడ్డం నిలువు కోతలు కోయటం తప్ప ఇలాంటి సమయంలో ప్రధానిని ఎందుకు ప్రశ్నించరని తెలంగాణవాదులు మండిపడుతున్నారు.