హైదరాబాద్, జూలై 6 (నమస్తే తెలంగాణ): చేప ఉత్పత్తులను ఆధునిక పద్ధతుల్లో ప్యాకింగ్ చేసేందుకు అన్నిచర్యలు చేపట్టనున్నట్టు ఫిషరీస్ ఫెడరేషన్ చైర్మన్ పిట్టల రవీందర్ వెల్లడించారు. దీనికోసం అనుసరించాల్సిన విధానాలపై చర్చించినట్టు ఆయన తెలిపారు.
హైదరాబాద్ సనత్నగర్లోని ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ప్యాకేజింగ్ కేంద్ర కార్యాలయాన్ని గురువారం ఫెడరేషన్ జనరల్ మేనేజర్ ఉప్పల శ్రీనివాస్తో కలిసి ఆయన సందర్శించారు. త్వరలో ప్రారంభించనున్న ఫిష్ఫుడ్ సెంటర్లలో చేపల ఆహార ఉత్పత్తులను ప్యాకేజింగ్ చేయడానికి అనుకూలమైన మార్గాలపై ఆ సంస్థ ప్రధానాధికారి నటరాజ్తో చర్చించారు. ఫిష్ క్యాం టీన్లలో తయారుచేస్తున్న ఆహార పదార్థాల ప్యాకేజీ పార్సిల్ పద్ధతులపైనా చర్చించారు. ఎండు చేపలు, రొయ్యల ఉత్పత్తులను విదేశాలకు ఎగుమతి చేసే ప్యాకేజీ పద్ధతులనూ వారు తెలుసుకొన్నారు.