అమీర్పేట్, ఫిబ్రవరి 27: ఈఎస్ఐ దవాఖానల చరిత్రలో మొట్టమొదటిసారిగా మూత్రపిండాల మార్పిడి శస్త్రచికిత్స నిర్వహించారు. జీవన్దాన్ కార్యక్రమంలో భాగంగా సనత్నగర్ ఈఎస్ఐసీ సూపర్ స్పెషాలిటీ దవాఖానలో బ్రెయిన్డెడ్ అయిన వ్యక్తి నుంచి సేకరించిన మూత్రపిండాన్ని డయాలిసిస్పై ఉన్న రోగికి అమర్చారు. ఈ ఆపరేషన్ తరువాత రోగి కోలుకుంటున్న నేపథ్యంలో ఈఎస్ఐ వైద్యులు మంగళవారం మీడియాతో మాట్లాడారు.
కిడ్నీ మార్పిడి ఆపరేషన్కు నేతృత్వం వహించిన డాక్టర్ జగదీశ్వర్, డాక్టర్ పాండురంగరావు, డాక్టర్ ధనలక్ష్మి మాట్లాడుతూ బీమాదారుడు (రోగి) శ్రీరాజ్కుమార్ కిడ్నీలు పాడవడంతో గత నాలుగేండ్లుగా డయాలిసిస్పై జీవనం సాగిస్తున్నాడని తెలిపారు. ఈ నెల 21న ఉస్మానియా దవాఖానలో ఓ వ్యక్తి బ్రెయిన్డెడ్ అయినట్టు అక్కడి వైద్యులు నిర్ధారించడంతో జీవన్దాన్ సంస్థ అతడి కిడ్నీని ఈఎస్ఐసీ సనత్నగర్కు కేటాయించింది. దీంతో ఈఎస్ఐసీ నెఫ్రాలజీ విభాగం వైద్య నిపుణులు డాక్టర్ కార్తీక్, న్యూరాలజీ విభాగం డాక్టర్ సందీప్ ఆ కిడ్నీని సనత్నగర్ ఈఎస్ఐసీకి తరలించారు. కాగా అప్పటికే డాక్టర్ జగదీశ్వర్ నేతృత్వంలో విజయవంతంగా కిడ్నీ మార్పిడి ఆపరేషన్ పూర్తి చేశారు. కిడ్నీని అమర్చిన రోగి క్రమంగా కోలుకుంటున్నారని, క్రియాటిన్ కూడా అదుపులోకి వస్తున్నదని, మూత్ర విసర్జన కూడా పూర్వ స్థితికి చేరుతున్నదని, అతి తొందరలోనే శ్రీరాజ్కుమార్కు డయాలిసిస్ అవసరం తప్పుతుందని వైద్యులు తెలిపారు.