జగిత్యాల, జూన్ 8 (నమస్తే తెలంగాణ) : తెలంగాణ తొలితరం ఉద్యమకారుడు, విద్యావేత్త, ప్రముఖ రచయిత మదుగంటి వెంకట నర్సింహారెడ్డి (87) కన్నుమూశారు. వయసు రీత్యా కొద్దినెలలుగా ఇంటికే పరిమితమైన ఆయన, సోమవారం జగిత్యాల జిల్లా కేంద్రంలోని ఆయన నివాసంలో తుదిశ్వాసం విడిచారు. జగిత్యాల జిల్లా మల్యాల మండలం తక్కళ్లపల్లికి చెందిన ఎంవీ నర్సింహారెడ్డి జగిత్యాల మల్టీపర్పస్ హైస్కూల్లో ప్రాథమిక విద్యను పూర్తిచేశారు. కరీంనగర్లో పీయూసీ కోర్సు చేశారు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడిన ఐదేండ్ల తర్వాత అప్పటి ప్రభుత్వం తెలంగాణలోని విద్యార్థి సంఘాలను రద్దు చేస్తూ అప్పటి విద్యాశాఖ మంత్రి ఎస్పీబీ పట్టాభి రామారావు ఉత్తర్వులు జారీ చేశారు. దాంతో తెలంగాణ వ్యాప్తంగా ఉన్నత పాఠశాల విద్యార్థులు ఉద్యమం మొదలుపెట్టారు. విద్యార్థుల ఆ పోరాటమే క్రమంగా తెలంగాణ తొలిదశ పోరాటానికి భూమికగా మారింది. ఆయనకు భార్య, కూతురు, కుమారుడు ఉన్నారు. నర్సింహారెడ్డి మృతి పట్ల బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి జీవన్రెడ్డి, జడ్పీ మాజీ చైర్పర్సన్ దావ వసంత తదితరులు సంతాపం ప్రకటించారు.