బంజారాహిల్స్, ఫిబ్రవరి 27: ‘న్యాయమూర్తిగా సుదీర్ఘ కాలం అందించిన సేవలకు సరైన గుర్తింపు ఇప్పిస్తాం..’, ‘అమెరికాలో స్థిరపడిన మీ పిల్లల భవిష్యత్తుకు ఉపయోగపడే పనులు చేయిస్తాం..’, ‘ కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీకి బాండ్ల రూపంలో విరాళాలు ఇస్తే మంచి భవిష్యత్తు ఉంటుంది’ అంటూ ఓ విశ్రాంత హైకోర్టు న్యాయమూర్తిని నమ్మించి రూ.2.5 కోట్లు తీసుకొని మోసం చేసిన వ్యక్తులపై ఫిలింనగర్ పోలీసులు చీటింగ్ కేసు నమోదు చేశారు.
ఓయూ కాలనీ సమీపంలోని డ్రీమ్ వ్యాలీలో నివాసం ఉంటున్న జస్టిస్ డీఎస్ఆర్ వర్మ ఏపీ, అలహాబాద్ హైకోర్టుల్లో న్యాయమూర్తిగా పనిచేసి పదవీ విరమణ చేశారు. ఆయనకు బంధువుల ద్వారా మూడేండ్ల క్రితం పరిచయమైన నరేంద్రన్ అనే వ్యక్తి 2021లో కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీకి బాండ్ల రూపంలో విరాళం ఇస్తే అనేక ప్రయోజనాలు చూడవచ్చని చెప్పాడు. తాను ఇవ్వదలచుకున్న మొత్తాన్ని ఆత్మీయ హోమ్స్ అనే నిర్మాణ సంస్థ డైరెక్టర్ కసిరెడ్డి శరత్రెడ్డికి ఇవ్వాలని అన్నాడు. నరేంద్రన్ మాటలు నమ్మిన జస్టిస్ వర్మ, భార్యతో పాటు కుమార్తెలు రూ.2.5కోట్ల వరకు కూడబెట్టి.. వారు సూచించిన అకౌంట్లలో జమచేశారు. ఇటీవల రాజకీయ పార్టీలు బాండ్ల రూపంలో సేకరించే విరాళాలు చట్టవిరుద్ధమని సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడంతో అప్రమత్తమైన జస్టిస్ వర్మ తాము ఇచ్చిన రూ.2.5కోట్ల విరాళాల గురించి వాకబు చేశారు. నరేంద్రన్ సదరు రాజకీయ పార్టీకి ఆ డబ్బు చెల్లించలేదని, సొంతానికి వాడుకుని మోసం చేశాడని తేలింది. దీంతో నరేంద్రన్, కసిరెడ్డి శరత్రెడ్డిలపై చర్యలు తీసుకోవాలంటూ జస్టిస్ డీఎస్ఆర్ వర్మ ఫిలింనగర్ పోలీసులకు ఫిర్యాదు చేయగా, కేసు నమోదు చేశారు.