హైదరాబాద్, జూన్23 (నమస్తే తెలంగాణ): ఏజెన్సీ ప్రాంత బీసీల్లోని సంచార, అర్ధ సంచార, విముక్త కులాలు, జాతులను ప్రత్యేకంగా గుర్తించాలని సినీనటుడు సుమన్ కోరారు. వారి జీవన ప్రమాణాల మెరుగుకు ప్రభుత్వానికి నిర్ధిష్టమైన సూచనలు చేయాలని సూచించారు. శుక్రవారం ఖైరతాబాద్ కార్యాలయంలో తెలంగాణ బీసీ కమిషన్ చైర్మన్ డాక్టర్ వకుళాభరణం కృష్ణమోహన్రావును ఆయన ప్రత్యేకంగా కలిసి వినతిపత్రం అందజేశారు.
బీసీ సంచారజాతుల సమస్యలపై చర్చించారు. తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు బీసీ వర్గాల అభ్యున్నతికి ఎంతో చేయూత అందిస్తున్నాయని సుమన్ కితాబు ఇచ్చారు. రాష్ట్ర బీసీ జాబితాలోని ఏ గ్రూప్లో ఉన్న సంచార, విముక్త కులాల కోసం ప్రత్యేక అధ్యయనం చేసి, వారి జీవితాల్లో ప్రభుత్వం వెలుగులు నింపే దిశగా బీసీ కమిషన్ సిఫారసులు చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ భేటీలో బీసీ కమిషన్ సభ్యులు సీహెచ్ ఉపేంద్ర, బీసీ సంచారజాతుల రాష్ట్ర ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.