హైదరాబాద్ సిటీబ్యూరో, డిసెంబరు 9 (నమస్తే తెలంగాణ): పశుసంవర్ధకశాఖ ప్రధాన కార్యాలయంలో ఫైళ్లు గల్లంతు ఘటన కలకలం రేపుతున్నది. కార్యాలయంలోని కీలక ఫైళ్లు మాయమైనట్టు కార్యాలయ వాచ్మన్ లక్ష్మయ్య ఫిర్యాదుతో మాజీ ఓఎస్డీ కల్యాణ్కుమార్తోపాటు నలుగురు సిబ్బందిపై పోలీసులు వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. తనపై వస్తున్న ఆరోపణపై కల్యాణ్కుమార్ స్పందించారు. అవి పూర్తిగా నిరాధారమని, దీనిపై ఎలాంటి విచారణకైనా తాను సిద్ధమని పేర్కొన్నారు.
సెంట్రల్జోన్ డీసీపీ, నాంపల్లి ఇన్స్పెక్టర్ల కథనం ప్రకారం.. ఈనెల 8న రాత్రి 7 గంటల సమయంలో కార్యాలయ వాచ్మన్ లక్ష్మయ్య విధుల్లో భాగంగా గదులు తనిఖీ చేస్తుండగా మాజీ ఓఎస్డీ కల్యాణ్కుమార్ గది తాళాలు తెరిచి ఉండడం చూసి అనుమానించారు. లోపలికి వెళ్లి చూడగా ఫైళ్లు చిందరవందరగా కనిపించాయి. దీంతో ఆయన ఆరా తీయగా సాయంత్రం ఐదున్నర గంటల సమయంలో కల్యాణ్కుమార్, కంప్యూటర్ ఆపరేటర్ మోహన్, ఎలిజా, అటెండర్లు వెంకటేశ్, ప్రశాంత్ వచ్చి ముఖ్యమైన డాక్యుమెంట్లు తీసుకెళ్లినట్టు తెలిసింది. వెంటనే ఆయన నాంపల్లి పోలీసులు, డీసీపీకి ఫిర్యాదు చేశారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఆధారాలు సేకరించారు. నిందితులపై 409, 427, 448, 477, 109 రెడ్విత్ 34ఐపీసీ సెక్షన్ల కింద కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు నాంపల్లి ఎస్ఐ జానయ్య తెలిపారు.
ఫైల్స్ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వద్దే ఉంటాయి: మాజీ ఓఎస్డీ
పశుసంవర్ధకశాఖ కార్యాలయంలో ఫైల్స్ మాయమైనట్టు వస్తున్న వార్తలు పూర్తిగా నిరాధారమని మాజీ ఓఎస్డీ కల్యాణ్ కుమార్ శనివారం ఒక ప్రకటనలో పేరొన్నారు. మాసాబ్ట్యాంక్లోని పశుసంవర్ధకశాఖ డైరెక్టర్ కార్యాలయంలో నిర్వహిస్తున్న అప్పటి మంత్రి తలసాని కార్యాలయాన్ని నూతన సచివాలయంలోని రెండో అంతస్తులోకి తరలించినట్టు తెలిపారు. మంత్రి ఆమోదం కోసం వచ్చిన ఫైల్స్ను నిర్దిష్ట విధానంలో ఎప్పటికప్పుడు పశుసంవర్ధకశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కార్యాలయంలో అందజేసినట్టు వివరించారు. ప్రభుత్వ మార్పిడి నేపథ్యంలో ఫర్నిచర్, ఇతర సామాగ్రిని జీఏడీకి అప్పగించే ప్రక్రియలో భాగంగానే మాసాబ్ట్యాంక్ కార్యాలయానికి తాను, తమ కార్యాలయ సిబ్బంది వెళ్లామని వివరించారు. శాఖాపరమైన ఫైల్స్ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, డైరెక్టర్ కార్యాలయంలోనే ఉంటాయని తెలిపారు.